సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రాజకీయ అడుగులు చాలా షార్ప్ గా ఉంటాయి అనేది అందరికీ తెలిసిందే. సున్నితమైన సామాజిక అంశాలను ఆయన వాడుకుని రాజకీయంగా తన ప్రత్యర్ధులను బలహీనపర్చి తను బలపడటంలో, ప్యూహాలు వేయడంలో జగన్మోహనరెడ్డి దిట్ట. ముఖ్యంగా ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలనే నమ్ముకున్నారు. ఈ వర్గాలకే రాష్ట్రంలో ఎక్కువ ఓటు బ్యాంక్ ఉంది. కమ్మ, కాపు, రెడ్డి, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, వెలమ, క్షత్రియ వంటి సామాజికవర్గాల కంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓటింగ్ శాతం ఎక్కువ. అందుకే జగన్మోహనరెడ్డి ఆ సామాజికవర్గాలను నమ్ముకుంటే చాలు అన్న ధీమా లో ఉన్నారు.
మంగళగిరిలో గంజి చిరంజీవులుతో ప్లాన్
మంగళగిరి నియోజకవర్గంలో గంజి చిరంజీవులు బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడు. ఎంతైనా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఈ నియోజకవర్గంలో ఒక పొలిటికల్ పిల్లర్ గంజి చిరంజీవులు. ఆ పిల్లర్ ను వైసీపీ కూల్చేసింది. ఆయనను టీడీపీ నుండి బయటకు లాగేశారు. దీంతో నారా లోకేష్ ఈ నియోజకవర్గంలో మళ్లీ బేస్ మెంట్ సిద్దం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లోకేష్ అని, మాజీ సీఎం కుమారుడు అన్న బ్రాండ్ ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గంలో ఆయనను ప్రజలకు చేరువ చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది గంజి చిరంజీవులు. గంజి చిరంజీవులు ఆ నియోజకవర్గంలో ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్న సామాజిక వర్గ నాయకుడు. ఆ నాయకుడు టీడీపీ నుండి బయటకు వెళ్లిపోయారు. వైసీపీలో చేరడానికి రెడీ అవుతున్నారు. ఇది వైసీపీ ఇంటర్నల్ గేమ్ యే కదా..? ఇది ఎప్పటి నుండో ప్రీ ప్లాన్డ్ గా జరుగుతుందంటారా..? కాదా..!
కోనసీమ ఇష్యూ లోనూ..
కోనసీమలో ఏమి జరిగిందో తెలుసుకదా.. ! కోమసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం. అక్కడ జరిగిన గొడవలు తెలిసిందే. నిజంగా ఆ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలంటే జిల్లాల పునర్విభజన సమయంలోనే పెట్టవచ్చు. కానీ పెట్టలేదు. అక్కడ జరిగిన గొడవల నేపథ్యంలో ఒక వర్గం వారు అంబేద్కర్ పేరును వ్యతిరేకిస్తున్నారు అన్నట్లుగా రాజకీయంగా ప్రొజక్ట్ చేయడం. ఇదంతా కూడా ఒక వర్గాన్ని ఎస్సీలకు దూరం చేయడం, దూరమైన ఆ వర్గాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్లాన్. ఇదే సమయంలో టీడీపీలో ఉన్న కొంత మంది మహిళా నాయకులను ట్రాప్ చేసో, లేదా భయపెట్టో వాళ్లకు ఇష్టం లేకనో బయటకు వెళ్లి ఆ పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడారు కదా. పార్టీ నుండి బయటకు వెళుతున్న వారు టీడీపీలోని అంతర్గత విషయాలను మాట్లాడేస్తున్నారు. వారు సామాజిక అంశాలనే మాట్లాడుతున్నారు. టీడీపీలో బీసీలకు విలువలేదు. ఎస్సీలకు విలువలేదు. క్రీస్టియన్ లకు విలువలేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. టీడీపీని దారుణంగా డ్యామేజ్ చేసేలా మాట్లాడుతున్నారు.
గోరంట్ల ఇష్యూతో టీడీపీకి దూరమైన ఆ సామాజిక వర్గం
ఈ ఘటనలపై టీడీపీ ఏమి నేర్చుకుంది.. ? ఏమైనా అలర్ట్ అయ్యిందా .. ? రివర్స్ గేమ్ మొదలు పెట్టిందా..? అంటే లేదు. కోనసీమ విషయం తీసుకున్నా, గంజి చిరంజీవులు విషయం తీసుకున్నా, దివ్యవాణి విషయం తీసుకున్నా, గోరంట్ల మాధవ్ విషయానికి వచ్చినా సరే .. ఆయన బీసీ సామాజికవర్గం కురుమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దాన్ని సామాజికవర్గానికి ముడి పెట్టి మరో సామాజికవర్గానికి వ్యతిరేకం అన్నట్లుగా మార్చి ఆ పార్టీకి ఆ సామాజిక వర్గాన్ని దూరం చేసేలా చేయగలిగారు. ఎక్కడ ఏమి జరిగినా సరే దాన్ని సామాజిక అంశంగా మార్చి ప్రతిపక్ష పార్టీకి దూరం చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఒక పొలిటికల్ గేమ్. ఈ గేమ్ టీడీపీ చిక్కుకుంటుందా. ? చాకచక్యంగా బయటపడుతుందా..? అనేది వేచి చూడాలి.