Chandrababu Naidu: చంద్రబాబుపై సీబీఐ విచారణ చేయాలి. ఇదేమి కొత్త డిమాండ్ కాదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చాలా సార్లు ప్రయత్నాలు చేసింది. చాలా ఇష్యూస్ లో, చాలా సందర్భాలలో చంద్రబాబు మీద, నారా లోకేష్ మీద సీబీఐ విచారణ చేయాలని పట్టుబట్టింది. ఒకానొక దశలో వైసీపీ ఎంపీలు అంతా కూడా పార్లమెంట్ లో చంద్రబాబుపై సీబీఐ విచారణ వేయాలి. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో జరిగిన అవినీతి మీద విచారణ చేయాలి. నారా లోకేష్ ఆధ్వర్యంలోని పైబర్ నెట్ కుంభకోణంపై ఎంక్వైయిరీ వేయాలని లోక్ సభలో ధర్నాలు కూడా చేశారు. పోడియం వద్దకు కూడా వెళ్లారు. ఒక రాజకీయ కారణంతో వైసీపీ ఎంపీలు ఈ ఆందోళన చేశారు. ఇప్పుడు కొ్త్తగా మళ్లీ చంద్రబాబు మీద సీబీఐ విచారణ జరపాలని వైసీపీ పట్టుబడుతోంది. ఇదేదో రాజధాని అంశమో, ఫైబర్ గ్రిడ్ అంశమో కాదు. పెగాసస్ మీద. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీలో పెగాసస్ అంశంపై ఓ బ్లాస్టింగ్ న్యూస్ బయటపెట్టారు. దీన్ని ఏపిలో వైసీపీ ఎంతగా వాడుకోవాలో అంతకు మించి వాడుకుంటోంది.
Chandrababu Naidu: కల్తీ సారా మరణాలపై వైసీపీని ఇబ్బంది పెడుతుంటే..వైసీపిీ అస్త్రంగా పెగాసెస్
ఒ పక్క తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలపై వైసీపీని ఇబ్బంది పెట్టాలనీ, అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని చూస్తోంది. లిక్కర్ మాఫియాను మొత్తం బయటకు తీయాలి. జంగారెడ్డిగూడెం లో జరిగిన మరణాలు ప్రభుత్వం విక్రయిస్తున్న నకిలీ మద్యం, నాటు సారా వల్లనే అంటూ రాజకీయంగా వైసీపీని ఇరుకున పెట్టేందుకు చూస్తోంది. ఇటు వైసీపీకి ఇప్పుడు పెగాసస్ పేరుతో సరైన ఆయుధం దొరికింది. పెగాసస్ స్పైవేర్ అనేది దేశ రాజకీయాలను చుట్టేస్తోంది. ఇది ప్రత్యర్ధుల మీద నిఘా పెట్టడానికి, ప్రత్యర్ధుల కదలికలపై నిఘా, ప్రత్యర్ధుల సెల్ ఫోన్ లు ట్యాప్ చేయడానికి ఉపయోగపడుతుంది. దాన్ని టీడీపీ కొనుగోలు చేసింది. వాడారు అనేది వైసీపీ ఆరోపణ. అది మమతా బెనర్జీ చెప్పారు. అలా ఎవరు చెప్పించారు. ఆ పొలిటికల్ గేమ్ ఏమిటి అనేది పక్కన బెడితే.. దానిపై సీబీఐ ఎంక్వైయిరీ వేయాలని టీడీపీ వాదించడమే ఇప్పుడు కొత్త విషయం. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మీద పెగాసస్ అంశంపై సీబీఐ విచారణ చేయాలి అని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు హయాంలో పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసిందా లేదా అనే దానిపై సీబీఐ విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. దీనిపై తాము కేంద్రానికి లేఖ రాస్తాం, సీబీఐకి లేఖ రాస్తాము. అవసరమైతే ఢిల్లీ వెళ్లి పెద్దలను కలుస్తాము, ఖచ్చితంగా సీబీఐ విచారణ జరగాల్సిందే. అసలు పెగాసస్ కొనలేదు అన్న నమ్మకం ఉంటే చంద్రబాబే స్వయంగా సీబీఐ విచారణ కోరాలి అని కొత్త వాదనను, కొత్త పాయింట్ ను వెల్లంపల్లి లేవనెత్తారు.మరో పక్క ఇదే అంశంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. అధికార పక్షం డిమాండ్ తో పెగాసస్ పై విచారణకు హౌస్ కమిటీ వేయనున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.
కేవలం ఆరోపణపై సీబీఐ విచారణ సాధ్యమేనా..?
ఇక మంత్రి వెల్లంపల్లి చేసిన డిమాండ్ విషయానికి వస్తే.. ఒక ఆరోపణపై సీబీఐ విచారణ సాధ్యమేనా..? ప్రతి అంశంపై విచారణ చేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఏమైనా ఖాళీగా ఉందా..? ప్రస్తుతం సీబీఐ వద్ద దేశ వ్యాప్తంగా 1400 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వీటిని విచారణ చేయడానికి ఏడాదికి వంద కేసులు చొప్పున చూసుకున్నా ఇవి తేల్చడానికే 14 సంవత్సరాలు పడుతుంది. వైఎస్ వివేకానంద రెడ్డి కేసే మనం చూస్తున్నాం. ఏడాదిన్నరపైగా సాగుతూనే ఉంది. అదే విధంగా డాక్టర్ సుధాకర్, ఆయేషా మీరా, సుగాలి ప్రీతి, అంతర్వేది రథం దగ్దం, న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్ ల కేసు ఇలా ఏపిలోనే చాలా కేసులు విచారణ దశలోనే ఉన్నాయి. వీటిలోనే నిజానిజాలు నిగ్గు తేల్చడానికి సంవత్సరాల సమయం పడుతోంది. ఇప్పుడు కొత్త కేసు. ఇది రాజకీయ ప్రాధాన్యత కేసు కావడం వల్ల తీసుకుని త్వరగా ముగించాలి అనుకున్నా.. ఇది కేవలం ఆరోపణ మాత్రమే. ప్రాధమిక సాక్షధారాలు ఉండాలి. న్యాయస్థానం ఒప్పుకోవాలి. వీళ్లు చేస్తున్న వాదన ఎంత వరకు చట్టబద్దంగా నిలబడుతుంది. ఏ మేరకు కేంద్రం, సీబీఐ స్పందిస్తుంది అనేది చూడాలి. అయితే పెగాసెస్ అంశాన్ని ఏ మేరకు వాడుకోవాలి అనేది వైసీపీ పక్కా ప్లాన్ తో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.