YCP: రాజకీయాల్లో గానీ ఇతర రంగాల్లో గానీ ఒకొక్కరికి అనూహ్యంగా అవకాశాలు లభిస్తుంటాయి. సామాజిక సమీకరణల్లో ఒక్కో సారి ఊహించని వారికి పదవులు లభిస్తుంటాయి. కొందరికి పదవి ఊరిస్తూనే అందని ద్రాక్షగా అవుతుంటుంది. ఆ కోవలోకి వస్తారు గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్. ఎవరికైనా అనూహ్యంగా కలిసి వచ్చినా, రాజకీయాల్లో అనుకోకుండా పదవులు వచ్చినా అతనికి అదృష్టం వరించిందని, సుడి ఉండటం వల్లనే ఇది సాధ్యమయ్యిందని అంటుంటారు. మర్రి రాజశేఖర్ విషయానికి వచ్చేసరికి ప్రతి సారి ఎమ్మెల్సీ ఖాళీల భర్తీ సమయంలో ఆయన పేరు మీడియాలో వస్తుంటుంది. వైఎస్ జగన్మోహనరెడ్డి గత ఎన్నికల సమయంలో మర్రికి ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవిని ప్రామిస్ చేసి ఉండటం. అదీ కూడా పబ్లిక్ మీటింగ్ లో చెప్పడంతో ప్రతి సారి ఆయన పేరు ప్రముఖంగా వినబడుతూ వస్తోంది. మర్రి రాజశేఖర్ కు జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని అందరూ భావిస్తున్నారు.
YCP: ఎన్నికలకు ముందు జగన్ హామీ
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ జిల్లా పార్టీ అధ్యక్షుడుగా కూడా పని చేశారు. గత ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే టికెట్ మర్రి రాజశేఖర్ కు కన్ఫర్మ్ అని ప్రచారంలో జరిగింది. అయితే విడతల రజిని ఎన్నికలకు ముందు టీడీపీ నుండి వైసీపీలో చేరడంతో సామాజిక సమీకరణాల నేపథ్యంలో బీసీ వర్గానికి చెందిన ఆమెకు జగన్ టికెట్ ఇచ్చారు. నాడు ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదనీ మర్రి బాధపడాల్సిన పని లేదనీ, ప్రభుత్వం రాగానే మర్రికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటానని హామీ ఇచ్చారు. రజినిని గెలిపించుకుని తీసుకురావాలని సూచించారు. దీంతో మర్రి రాజశేఖర్ విడతల రజని గెలుపునకు తీవ్రంగా కృషి చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్ సీఎం కాగానే గుంటూరు జిల్లా నుండి ముందుగా మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి వస్తుందని భావించారు. అయితే మంత్రి పదవి సంగతి అలా ఉంచితే కనీసం ఎమ్మెల్సీ పదవికీ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
మీడియాలోనే పేరు … జగన్ జాబితాలో నిల్
జగన్మోహనరెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రెండున్నరేళ్లు అవుతోంది. ఈ రెండున్నరేళ్లలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యుల్ విడుదల అయిన ప్రతి సారి మర్రి పేరు మీడియా రావడం రివాజుగా మారుతున్నా సీఎం జగన్ ఖరారు చేసే లిస్ట్ లో మాత్రం పేరు ఉండటం లేదు. తాజాగా 14 ఎమ్మెల్సీ స్థానాల భర్తీలోనూ ఆయన పేరు లేకపోవడంతో ఆయన వర్గీయులు నిరుత్సాహానికి గురి చేసింది. గుంటూరు జిల్లా నుండి సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (కాపు)కు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధిగా మళ్లీ ప్రకటించి గౌరవించారు. అదే విధంగా చేనేత సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుకు అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి దక్కింది.
ఎమ్మెల్సీ రాకపోవడానికి కారణం ఇదేనా
అయితే చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే విడతల రజనీ, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ మధ్య గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. రెండున్నర సంవత్సరాలుగా ఇద్దరు రెండు గ్రూపులుగానే రాజకీయాలు కొనసాగిస్తున్నారు. మర్రికి ఎమ్మెల్సీ రాకపోవడంతో ఎమ్మెల్యే విడతల రజనీ పై చేయి సాధించినట్లుగా అనుకుంటున్నారు. ఈ పరిణామం మర్రి వర్గీయులను షాక్ కు గురి చేసింది. మంత్రి వర్గ ప్రక్షాళన త్వరలో జరగనున్న తరుణంలోనూ మర్రికి ఎమ్మెల్సీ అవకాశం లభించకపోవడంతో ఇక సైడ్ చేసినట్లేననే టాక్ వినబడుతోంది. అయితే ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేని చాలా మంది నేతలకు జగన్ ఎమ్మెల్సీ హామీలు ఇచ్చి ఉన్నారు. ఇంకా డజను మందికిపైగా ఎమ్మెల్సీ పదవులపై ఆశ పెట్టుకున్న నేతలు ఉన్నారు. అందులో వీరిలో ఆశల కొనసాగింపుగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట చెప్పారు. ఇదే చివరి జాబితా కాదనీ, ఇప్పుడు అవకాశం లభించని నేతలకు తరువాత అవకాశం కల్పించడం జరుగుతుందని వెల్లడించారు.