ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. దేవాలయాలలో విగ్రహాలు పగులుతున్న క్రమంలో ప్రతిపక్షాలు అధికార పార్టీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో మతాల పేరు చెప్పుకొని ఆరోపణలు చేసుకుంటున్నారు. పరిస్థితి ఇలా ఉండగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు ప్రస్తుతం అధికార పార్టీలోనే ఉన్నారు. అయినా కానీ పార్టీలో ఉన్న నాయకులు ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదని దీంతో పార్టీ మారే ఆలోచనలో ఆయన ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
జిల్లాలో పార్టీ కీలక నేతలతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా డేవిడ్ రాజు ని లైట్ తీసుకుంటున్నట్లు దాంతో ఇటీవల ఆయన అనుచరులతో మంతనాలు జరిపి తెలుగుదేశం పార్టీ లోకి వెళ్ళడానికి రెడీ అయినట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన ఈయన ఆ సమయంలో వైసీపీ పార్టీ తరఫున గెలవగా.. అప్పట్లో టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు సమక్షంలో టిడిపి పార్టీలో జాయిన్ అయ్యారు. డేవిడ్ రాజు రాజకీయ ప్రయాణం టీడీపీ నుండి మొదలైంది.
1999 లో టిడిపి నుండి సంతనూతలపాడు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అంతకు ముందు జిల్లా జడ్పీ చైర్మన్ గా పని చేశారు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేయగా ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ లో జగన్ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో గెలిచినా తర్వాత కొద్దిరోజుల్లోనే టిడిపి తీర్థం పుచ్చుకోవడం జరిగింది. కానీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు డేవిడ్ రాజు కి టికెట్ కేటాయించకపోవడంతో మనస్థాపం చెంది వైసీపీలో చేరారు. అధికారంలోకి జగన్ రావడంతో ఏదో ఒక నామినేటెడ్ పదవి తనకు వస్తుందని భావించినా గానీ ఇప్పటి వరకూ పదవి రాకపోవడంతో పాటు పార్టీలో గౌరవం లేకపోవడంతో మనస్థాపంతో తిరిగి సొంత గూటికి టీడీపీ లోకి వెళ్లి పోయే ఆలోచన డేవిడ్ రాజ్ చేస్తున్నట్లు, చంద్రబాబుతో ఇప్పటికే టచ్ లో ఉన్నట్లు టాక్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో వినబడుతోంది.