వైసీపీ యువ నాయకుడు దేవినేని అవినాష్ నివాసంలో నిన్న ఉదయం ఐటీ అధికారులు సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. మరో పక్క హైదరాబాద్ లోని వంశీరామ్ బిల్డర్స్ పై రెండో రోజు అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల సందర్భంలో విలువైన డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు ఐటి అదికారులు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేవినేని అవినాష్ నివాసంలో సోదాలు ఈ తెల్లవారుజామున ముగిసాయి. కేంద్ర భద్రతా (సీఆర్పీఎఫ్) బలగాల భద్రత నడుమ గుణదలలోని దేవినేని అవినాష్ నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
కాగా ఐటీ తనిఖీలపై ఇవేళ దేవినేని అవినాష్ స్పందించారు. ఈ సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ఇంటి నుండి ఐటీ అధికారులు ఎలాంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోలేదని తెలిపారు. 24 గంటల పాటు తమ నివాసంలో ఐటి సోదాలు జరిగాయన్నారు. తన తండ్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) తమకు అప్పగించిన వ్యవసాయ భూములు ఉన్నాయనీ, అలానే హైదరాబాద్ లో ఒక ల్యాండ్ తమకు ఉందని చెప్పారు. దానిని అభివృద్ధికి ఇచ్చామని తెలిపారు. తమ ఇంటి నుండి ఐటి అధికారులు హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారని జరుగుతున్న ప్రచారం నిజంకాదని చెప్పారు.
ఐటి అదికారులు పలు ప్రశ్నలు వేశారనీ, వాటికి తాను సమాధానం ఇచ్చానని తెలిపారు. తమ కుటుంబం నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలోనే ఉందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తాము బలపడుతుండటంతో టీడీపీ వ్యవస్థలతో కుమ్మక్కు అయి తమపై ఇలాంటి దాడులకు ఉసిగొల్పిందని అవినాష్ ఆరోపించారు. ఇటువంటి వాటితో తానేమీ భయపడబోమని అవినాష్ పేర్కొన్నారు. నిన్న ఉదయం దేవినేని అవినాష్ నివాసంతో పాటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నివాసంలోనూ ఐటి అధికారులు తనిఖీలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ వల్లభనేని వంశీ నివాసంలో ఎటువంటి సోదాలు జరగలేదు.
TRS MLAs poaching case: ఏసీబీ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన సిట్