అధికార వికేంద్రీకరణకు మద్దతుగా రేపు విశాఖలో గర్జన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నేతలు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణకు మద్దతుగా జరిగే విశాఖ గర్జనను జయప్రదం చేయాలని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖ రాజధానిగా ఉండకూడదని, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రాంతానికి దండ యాత్రగా వస్తున్న రైతులకు శాంతియుత నిరసన తెలియజేయాలని ప్రజలను కోరారు.వికేంద్రీకరణకు ప్రభుత్వ కట్టుబడి ఉందన్నారు.
రైతుల ముసుగులో బూటకపు యాత్ర
రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ నేతలు కొనుగోలు చేసిన భూముల ధరలు ఎక్కడ తగ్గిపోతాయో, తమ వ్యాపారాలు ఎక్కడ దెబ్బతింటాయోనన్న స్వార్ధంతోనే అమరావతి పేరుతో పాదయాత్ర చేస్తున్నారని హోంశాఖ మంత్రి తానేటి వనిత విమర్శించారు. అమరావతి రైతుల ముసుగులో పచ్చమీడియా సహకారంతో చేస్తున్న ఓక బూటకపు యాత్రగా అభివర్ణించారు. వీరి పాదయాత్రకు ఎక్కడా ప్రజలు స్వాగతించడం లేదని అన్నారు. ప్రజల్లో ఏదోరకంగా అలజడి సృష్టించి గొడవలు పెట్టుకునేందుకు రెచ్చగొట్టడం, తద్వారా లబ్దిపొందాలనే టీడీపీ నేతలు పని చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.
ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని కుట్ర
ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. రాజధానికి 30వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలని వైఎస్ జగన్ అంటే.. చంద్రబాబు రైతుల నుండి బలవంతంగా ప్రైవేటు భూములను లాక్కున్నారని మండిపడ్డారు. అమరావతే బాగుండాలని వారు అనుకుంటున్నప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారికి వారు బాగుండాలని కోరుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. అమరావతిలోనే శాసన రాజధాని ఉంటుందని తెలిపారు. టీడీపీ మహానగరాన్ని నిర్మిస్తే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని డైనమైట్ లతో నేలమట్టం చేస్తున్నట్లుగా టీడీపీ, ఎల్లో మీడియా బిల్డప్ ఇస్తూ ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
విశాఖకు పరిపాలనా రాజధాని సాధిస్తాం
ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, కుతంత్రాలు చేసినా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలో మార్పు ఉండదనీ, విశాఖకు పరిపాలనా రాజదాని సాధించుకుని తీరుతామని పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు. విశాఖ గర్జన అహింస మార్గంలో జరగాలని, ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను తెలియజేయాలని జేఏసి పిలుపునిచ్చిందన్నారు. అన్ని ప్రాంతాలకు మంచి జరగాలనే కోరికతో పోరాటం చేస్తున్నామని, అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
ఐక్యంగా పోరాడాల్సిన సమయం వచ్చింది
విశాఖ రాజధాని కోసం ఐక్యంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. రైతులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రియల్ ఎస్టేట్ మాఫియాను నడుపుతున్నారని విమర్శించారు. ఒకప్పుడు రాజదానికి వెళ్లాలంటే వందల కిలో మీటర్లు ప్రయాణించాల్సి వచ్చేదనీ, ఇప్పుడు మనకు చేరువలోనే రాజధాని ఏర్పాటు కానున్నదని పేర్కొన్నారు. రాజధాని చేరువలో వస్తే విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుకానున్నాయనీ, కావున ఈ విషయమై అంతా ఏకమై పోరాడాల్సి ఉందని అన్నారు. పెద్ద క్యాపిటల్ అన్న కాన్పెప్టే ఈ రాష్ట్రానికి పనికి రాదు అని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందన్నారు.
విశాఖ గర్జన అందరి కళ్లు తెరిపిస్తుంది
అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా రేపు తలపెట్టిన విశాఖ గర్జన అందరి కళ్లు తెరిపిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖను రాజధానిగా వ్యతిరేకించే వాళ్ల కళ్లు తెరిపేలా తమ గర్జన ఉండబోతున్నదని పేర్కొన్నారు. గర్జన తర్వాత ఏ నిమిషంలో విశాఖ నుండి పరిపాలన ప్రారంభం అవ్వాలన్నదే తమ కోరిక అని తెలిపారు. పరిపాలనా వికేంద్రీకరణే కాదు నిధుల విభజన కూడా జరగాలని అన్నారు. ఉద్యమాన్ని ప్రతి గడపకు తీసుకువెళతామని పేర్కొన్నారు. జాతి సంపద అందరికీ చెందాల్సిందేనని స్పష్టం చేశారు. రాజకీయ కారణాలతో విశాఖ ను రాజధానిగా వ్యతిరేకించడం అంటే ద్రోహం చేయడమేనని మంత్రి బొత్స అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు విశాఖను రాజధానిగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని బొత్స డిమాండ్ చేసారు.
కాగా తూర్పు గోదావరి జిల్లాలో మూడు రాజధానులకు మద్దతుగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు నిడదవోలులో నిరసన సెగ తగిలింది. నల్లబెలూన్లు, ప్లకార్డులతో పెద్ద ఎత్తున ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు.