నిన్న మచిలీపట్నంలో జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవ సభ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అభిమానులు కార్యకర్తల మధ్య పవన్ కళ్యాణ్ ప్రసంగం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. కచ్చితంగా తనతోపాటు పోటీ చేసే ప్రతి ఒక్కరూ అసెంబ్లీలో కూర్చునేలా వ్యూహాలు ఉంటాయని అన్నారు. జనసేన ఒంటరిగా గెలిచే రీతిలో ప్రజల నుండి సంపూర్ణమైన నమ్మకం కలిగితే.. ఒంటరిగా బరిలోకి దిగుతాం. అయితే ఈ విషయంపై ప్రజలలోకి నేను వెళ్ళటంతో పాటు సర్వేలు చేయించుకుని డేటా బట్టి నిర్ణయం తీసుకుంటాం అని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే నిన్న ఆవిర్భావ సభలో పవన్ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రియాక్ట్ అయ్యారు.
బుధవారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనకి అసలు దిశ దశ ఉందా అని ప్రశ్నలు వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ అన్ని స్థానాలలో పోటీ చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. అన్ని స్థానాలలో పోటీ చేసే దమ్ము లేదు… కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ప్రతిసారి కులాల గురించి ప్రస్తావిస్తున్నారు. బీసీలకు అన్యాయం చేసిన చంద్రబాబుకు… పవన్ కళ్యాణ్ వంత పాడుతున్నారు అని మండిపడ్డారు. వంగవీటి రంగా హత్య కేసులో చంద్రబాబు హస్తం ఉన్నట్లు హరి రామ జోగయ్య పుస్తకంలో రాశారు.
మరి అటువంటి రంగానీ చంపిన వాళ్లపై అనుకూలంగా మాట్లాడాలని… పవన్ ఏమైనా సూచనలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. రంగాను చంపిన వాళ్లను పవన్ సమర్ధిస్తున్నట్లేనా అని నిలదీశారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఒక రోడ్డు అయినా వేశారా అని సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు మేలు చేస్తుంటే ఆయనపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు మళ్ళీ జగన్ నీ ముఖ్యమంత్రి చేసి తీరుతారు. దమ్ముంటే 175 స్థానాలకు పోటీ చేయండి అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు జనసేనకు సవాల్ విసిరారు.