AP Assembly: కోర్టులు తమ పరిధి దాటి కార్యనిర్వహక పనిలోకి జోక్యం చేసుకోకూడదని సుప్రీం కోర్టే చెప్పిందని సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఏపి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం పరిపాలనా వికేంద్రీకరణ..మూడు రాజధానులపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మూడు రాజధానుల విషయంలో హైకోర్టు వ్యాఖ్యలను ధర్మాన ప్రసాదరావు ప్రస్తావిస్తూ.. న్యాయవ్యవస్థలో స్వీయ నియంత్రణ ఉండాలన్నారు. కానీ ఇతర వ్యవస్థల్లో అందునా శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోవడం ఎంత వరకు సమంజమని ప్రశ్నించారు. ఏపి అసెంబ్లీకి కొన్ని పరిమితులు పెడుతూ హైకోర్టు వ్యాఖ్యలు చేసిందనీ, మూడు రాజధానుల పై అసెంబ్లీ చట్టం చేయవద్దంటూ హైకోర్టు తెలిపిందన్నారు. దీనిపై తాను న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం సభా నాయకుడికి ఓ లేఖ రాసినట్లు చెప్పారు. దీనిపై సభలో చర్చించాల్సిన అవశ్యకత ఉందని భావిస్తున్నాన్నారు. న్యాయవ్యవస్థ ప్రాధాన్యతను తగ్గించాలన్న అభిప్రాయం తనకు ఏ మాత్రం లేదని కానీ బాధ్యతలన్ని కట్టడి చేసే విధంగా ఉన్నాయన్న అభిప్రాయం మాత్రమే తాను వ్యక్తం చేస్తున్నానన్నారు. ఈ సందర్భంలో పలు సుప్రీం కోర్టు తీర్పులను ధర్మాన ప్రసాదరావు ఉటంకించారు.
న్యాయవ్యవస్థతో పాటు మిగిలిన రెండు వ్యవస్థలు సమానమే
రాజరిక వ్యవస్థలో రాజే శాసనం. ఒకరి చేతుల్లో ఉండటం వల్ల ప్రజా వ్యతిరేకత పుట్టుకొచ్చిందన్నారు. ఆ తర్వాతే ప్రజాస్వామ్య పుట్టుకొట్టిందన్నారు. రాజ్యాంగం రావడం వెనుక ఎంతో మంది కృషి ఉందన్నారు. వ్యవస్థల పరిధి, విధులు ఏంటి అన్నదానిపై స్పష్టత ఉండాలన్నారు. సమాజం పట్ల తమకు పూర్తి బాధ్యత ఉందని గతంలో సుప్రీం కోర్టు ప్రకటించిందనీ, జ్యూడీషియల్ యాక్టివిజం పేరుతో కోర్టులు విధుల నిర్వహించకూడదని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఒక వేళ శాసన వ్యవస్థ సరిగా పని చేయకుంటే ఆ విషయాన్ని ఎన్నుకున్న ప్రజలే చూసుకుంటారనీ, అంతే కానీ కోర్టులు జోక్యం చేసుకోకూడదని అత్యున్నత న్యాయస్థానమే చెప్పిందని ధర్మాస ప్రసాదరావు గుర్తు చేశారు. న్యాయవ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించకూడదని కానీ సమీక్షించే అధికారం పౌరులకు ఉంటుందని అన్నారు. న్యాయవ్యవస్థతో పాటు మిగిలిన రెండు వ్యవస్థలు సమానమేని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. చట్టాలను చేసే అధికారం కేవలం శాసన వ్యవస్థకే ఉందని అన్నారు. విశ్లేషణలను నిపుణుల కమిటీలు చేయాలి కానీ కోర్టులు ఆ పని చేయకూడదని ధర్మాన పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయకుండా అడ్డుకుంటే నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. అసమానతలు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. దాని కోసమే కొత్త విధానాలను తీసుకొస్తుందన్నారు. విధానాన్ని మార్చే అధికారం శాసనసభకే ఉందని ఆయన స్పష్టం చేశారు.
AP Assembly: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎన్నో అభ్యంతరాలున్నా ఇది మా విధానం అని కేంద్రం చెప్పలేదా
ఒక పార్టీ సభలో మెజార్టీతో అధికారంలో ఉందంటే అంతకు ముందు ఉన్న ప్రభుత్వ విధానాలను మార్చమని ప్రజలు అధికారం ఇవ్వడమే అవుతుంది కదా అని ధర్మాన ప్రశ్నించారు. అ అధికారమే లేదని న్యాయస్థానాలు చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో వివిధ ప్రభుత్వాలు తీసుకున్న ఎన్నో నిర్ణయాలను తరువాతి ప్రభుత్వాలు మార్చిన సంగతిని ధర్మాన గుర్తు చేశారు. బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దును తర్వాతి ప్రభుత్వాలు చేయలేదా అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎన్నో అభ్యంతరాలున్నా ఇది మా విధానం అని కేంద్రం చెప్పలేదా అని అన్నారు ధర్మాన ప్రసాదరావు.