Chandra Babu: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (పట్టాభి) చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మొదలైన విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం కొనసాగుతూనే ఉంది. పట్టాభి వ్యాఖ్యలతో ఆవేశానికి లోనైన వైసీపీ అభిమానులు అటు పట్టాభి ఇంటిపైనా ఆ తరువాత మంగళగిరిలోని పార్టీ కార్యాలయంపైనా దాడికి పాల్పడటం, దీనికి నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష చేసిన సంగతి తెలిసిందే. దీక్ష విరమణ సందర్భంగా టీడీపీ నేతలు వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయనీ, డీజీపీని రీకాల్ చేయాలంటూ చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నేతల బృందం రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం సమర్పించింది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లడంప వైసీపీ నేతలు ఆయనను టార్గెట్ చేస్తూ విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఇదే కోవలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి స్పందించారు.
Chandra Babu: పట్టాభికి ప్రాణ హాని ఉంది
సీఎం వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి మాల్దీవులుకు పారిపోయిన టీడీపీ నేత పట్టాభికి పార్టీ అధినేత చంద్రబాబుపై నుండే ప్రాణ హానీ ఉందని ద్వారంపూడి షాకింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ది కోసం పట్టాభిని హత్య చేసి ఆ నేరాన్ని వైసీపీ నెట్టి సానుభూతి పొందాలనే కుట్రపూరిత మనస్థత్వం చంద్రబాబుదని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో పట్టాభి కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ద్వారంపూడి సూచించారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు పార్టీ మనుగడ కోసం ఎంతకైనా దిగజారుతారని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ను చంద్రబాబు కోరడంపై ద్వారంపూడి మాట్లాడుతూ గతంలో అమిత్ షా కాన్వాయ్ పై రాళ్లు వేయించిన చంద్రబాబు ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని ఆయన వద్దకు వెళుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయాలకు ఇదే ఉదాహరణ అని ద్వారంపూడి పేర్కొన్నారు.
మాల్దీవులకు పట్టాభి
టీడీపీ నేత పట్టాభి తొలుత ద్వారంపూడిపైనే హెరాయిన్, గంజాయి స్మగ్లింగ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాకినాడ తీరంలో గతంలో ఓ బోటు ధగ్ధం కాగా అందులో నుండి నల్లటి పొగల బదులుగా తెల్లని పొగలు వచ్చాయనీ, అంటే అందులో డ్రగ్స్ ఉన్నట్లేనని పట్టాభి అన్నారు. ఈ బోటు దగ్ధం వెనుక ద్వారంపూడి హస్తం ఉందని కూడా పట్టాభి ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ద్వారంపూడి వర్సెస్ పట్టాభిగా మాటల యుద్ధం కొనసాగింది. ఈ క్రమంలోనే ఇటీవల పట్టాభిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించగా హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదల అయిన తర్వాత పట్టాభి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఆయన ఎయిర్ పోర్టులో, విమానంలో కూర్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో మాల్దీవులకు వెళ్లారని ప్రచారం జరిగింది. ఈ తరుణంలో పట్టాభికి ప్రాణహాని ఉందంటూ ద్వారంపూడి షాకింగ్ కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.