YCP MLA: వైెఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా విధులు నిర్వహించేందుకు వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. 50 నివాస గృహాలకు ఒక వాలంటీర్ చొప్పున తీసుకున్నారు. కేవలం రూ.5 వేల గౌరవ భృతితో వాలంటీర్లు వారి పరిధిలోని కుటుంబాలకు సేవలను అందిస్తున్నారు. కొందరు వాలంటీర్లపై అవినీతి ఆరోపణలు వస్తున్నప్పటికీ ఎక్కువ శాతం మంది వాలంటీర్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్దిదారులకు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ప్రతి నెల 1 నుండి 5వ తేదీలోపు వాలంటీర్లు లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి సామాజిక పెన్షన్ల ను పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరాలను అర్హులకు తెలియజేస్తూ వారి వద్ద నుండి అర్జీలు తీసుకుని గ్రామ సచివాలయం ద్వారా అప్ లోడ్ చేయించి మంజూరుకు కృషి చేస్తున్నారు. పలువురు వాలంటీర్లు వారు అందిస్తున్న సేవల కారణంగా పలు జిల్లాల్లో ఎన్నికల్లో పోటీ చేసి విజయాలు సాధించారు. ఈ వాలంటీర్లకు గౌరవ వేతనం మినహా ప్రభుత్వం నుండి ఇతర ప్రయోజనాలు ఏమీ లేవు.
YCP MLA: 1475 మంది ప్రమాద భీమా పథకం
వాలంటీర్లు ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించిన తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వారికి ఏదో ఒకటి చేయాలన్న తలంపుతో ఓ మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. తన నియోజకవర్గ పరిధిలో 1475 మంది వాలంటీర్లు పని చేస్తుండగా వారికి ప్రమాద భీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టారు. జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా వాలంటీర్లకు ప్రమాద భీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా వాలంటీర్ల వ్యవస్థ పని చేస్తోందని పేర్కొన్న జక్కంపూడి రాజా…మహిళా వాలంటీర్ కొడేలి లీలావతి మృతి తనను కలచివేసిందన్నారు. ఆ భాధ లో నుండే వాలంటీర్లకు వారి కుటుంబాలకు అండగా ఉండాలని ప్రమాద భీమా పథకం అందించాలని ఆలోచన వచ్చిందన్నారు.
ఎవరెవరు ముఖ్యమంత్రి దృష్టిలో పడతారో..?
తన నియోజకవర్గం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉండాలన్నది తన ఆకాంక్ష అని పేర్కొన్నారు రాజా. ఈ ఎమ్మెల్యే చేసిన మంచి కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ఇతర ఎమ్మెల్యేలు స్పూర్తిగా తీసుకోమని సీఎం జగన్ సూచించే అవకాశం ఉందని అంటున్నారు. వినూత్న ఆలోచన ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వద్ద వంద మార్కులు కొట్టేశారని అనుకుంటున్నారు. మరి కొద్ది రోజుల్లో మంత్రివర్గ ప్రక్షాళన జరగనున్న సంగతి తెలిసిందే. మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలనే అంశంపై ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై గ్రౌండ్ లెవల్ రిపోర్టును సీఎం జగన్ సేకరిస్తున్నట్లు సమాచారం. పలువురు తమ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. వీటిని సోషల్ మీడియాలో, పత్రికల్లో వచ్చే విధంగా చూసుకుంటున్నారు. ఎవరెవరు ముఖ్యమంత్రి దృష్టిలో పడతారో చూడాలి మరి.