నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి తాను కుమారుడిని అని, తనను కుమారుడిగా ఆయన అంగీకరించాలంటూ బెంగళూరులో స్ధిరపడిన మేకపాటి శివచరణ్ రెడ్డి రాసిన బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డి స్పందించి వివరణ ఇచ్చారు. తనకు ఇద్దరు కుమార్తెలే ఉన్నారని చెప్పారు. శివ చరణ్ రెడ్డి తన కుమారుడే కాదని స్పష్టం చేశారు. శివచరణ్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఒక వీడియో విడుదల చేశారు చంద్రశేఖర్ రెడ్డి.
తన మొదటి భార్య తులసమ్మకు సంతానంగా రచన, రెండో భార్య శాంతకుమారికి సాయి ప్రేమితా రెడ్డి ఉన్నారని తెలిపారు. కేవలం డబ్బుల కోసమే తల్లీ కొడుకులు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. రాజకీయంగా అయితే రుగా తనను శివచరణ్ రెడ్డి ఎదుర్కొవాలని చంద్రశేఖర్ రెడ్డి సవాల్ చేశారు. శివచరణ్ రెడ్డి తండ్రి వెంకట కొండారెడ్డి అని పేర్కొన్నారు చంద్రశేఖరరెడ్డి. మరో పక్క శివచరణ్ రెడ్డి తాను డీఎన్ఏ పరీక్షలు సిద్దమని పేర్కొంటున్నారు.
తన తల్లికి చిన్నతనంలోనే మేనమామ కొండారెడ్డితో వివాహమవ్వగా, విబేధాల వల్ల విడిపోయారనీ, ఆ తర్వాత చంద్రశేఖర్ రెడ్డి తన తల్లితో సంబంధం పెట్టుకున్నారనీ, అయిదేళ్ల తర్వాత తాను జన్మించానని శివచరణ్ రెడ్డి చెప్పారు. డబ్బు కోసమే అయితే ఎప్పుడో అడిగేవాడిననీ, తన సర్టిఫికెట్ లలో కూడా తండ్రిగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేరే ఉందని స్పష్టం చేశారు. డీఎన్ఎ పరీక్షలకు తాను సిద్దమనీ, మేకపాటి కొడుకని నిరూపిస్తానని శివచరణ్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వం లేదా ఆస్తి అక్కర్లేదనీ, కేవలం గుర్తింపు మాత్రమే కోరుకుంటున్నానని శివచరణ్ రెడ్డి వెల్లడించారు. ఈ ఇద్దరి వాదనలు నియోజకవర్గంలో చర్చనీయాంశం అయ్యింది.