గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పార్టీ మార్పు అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె భర్త ఐఆర్ఎస్ అధికారి దయాసాగర్ టీడీపీలో చేరతారనీ, రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయనున్నారనీ ఇటీవల ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో సుచరిత చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాజకీయంగా తమ మనుగడ వైసీపీతోనే అని స్పష్టం చేశారు. తాను ఒక స్టేట్ మెంట్ ఇచ్చానంటే తన భర్త దయాసాగర్ కూడా దానికి కట్టుబడే ఉంటారని అన్నారు. అలా కాకుండా ‘నా భర్త పార్టీ మారతాను, నువ్వు నాతో రా అంటే ఎంత రాజకీయ నాయకురాలినైనా భర్తతో పాటు వెళ్లాల్సిందేగా’ అని పేర్కొన్నారు. ఇదే క్రమంలో మరో కీలక వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం ఒకే కుటుంబంలోని వ్యక్తులు వేరువేరు పార్టీల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. దాన్ని ఉద్దేశించి తన భర్త ఒక పార్టీలో.. తాను మరొక పార్టీలో…తమ పిల్లలు వేరొక పార్టీలో ఉండరని, ఉంటే అందరం ఒకే పార్టీలోనే ఉంటామని పేర్కొన్నారు సుచరిత. రాజకీయాల్లో ఉన్నంత కాలం సీఎం వైఎస్ జగన్ తో ఉండాలని అనుకున్నామని అన్నారు. గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన ఓ కార్యక్రమంలో సుచరిత ఈ వ్యాఖ్యలు చేశారు.
సుచరిత రాజకీయ నేపథ్యం విషయానికి వస్తే.. 2003 లో వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2006 లో గుంటూరు జిల్లా ఫిరంగిపురం జడ్పీటీసీగా విజయం సాధించారు. ఆ పదవిలో రెండేళ్లు కొనసాగారు. 2009 ఎన్నికల్లో ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి నాటి టీడీపీ అభ్యర్ధి కందుకూరి వీరయ్య పై సుమారు 2వేల ఓట్ల మెజార్టీతో గెలుపొంది మొదటి సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం 2011లో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి నాటి టీడీపీ అభ్యర్ధి కందుకూరి వీరయ్య పై మరో సారి విజయం సాధించారు. 2014 ఎన్నికలకు ముందు ఆమెను టీడీపీ ఆహ్వానించి టికెట్ ఇస్తామని ఆఫర్ చేసినప్పటికీ ఆమె వైఎస్ఆర్ కుటుంబంపై ఉన్న విధేయతతో ఆ పార్టీ తరపునే పోటీ చేసి రావెల కిషోర్ బాబు చేతిలో పరాజయం పాలైయ్యారు. ఆ తర్వాత వైసీపీ ఇన్ చార్జిగా కొనసాగారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి నాటి టీడీపీ అభ్యర్ధి మాణిక్య వరప్రసాదరావు, జనసేన అభ్యర్ధి రావెల కిషోర్ బాబులను ఓడించి మూడవ సారి విజయం సాధించారు. జగన్మోహనరెడ్డి తొలి మంత్రి వర్గంలో హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
అయితే మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో సుచరితకు మరో సారి అవకాశం కల్పించకపోవడంతో మనస్థాపానికి గురైయ్యారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో భేటీ అనంతరం తనకు అసంతృప్తి ఏమీలేదని ప్రకటించారు. ఆ తర్వాత పార్టీ జిల్లా కన్వీనర్ బాధ్యతలను అమెకు అప్పగించారు. అయితే ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆమె పార్టీ పై అసంతృప్తితో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. ఈ తరుణంలోనే ఆమె భర్త దయాసాగర్ టీడీపీ నేతలతో పార్టీలో చేరేందుకు చర్చలు కూడా జరుపుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుచరిత చేసిన ఆసక్తికరంగా మారాయి.
ఏపిలో రేషన్ కార్డుదారులకు మరో గుడ్ న్యూస్ .. ప్రజల ఆరోగ్యం కోసం మరో రెండు వస్తువుల పంపిణీకి చర్యలు