YCP MLA RK Roja: ఇండిగో విమాన సంస్థపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజాతో సహా పలువురు ప్రయాణీకులు ఫైర్ అయ్యారు. ఈ రోజు రాజమండ్రి నుండి తిరుపతి బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. తిరుపతి ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సాధ్యం కాకపోవడంతో దాదాపు గంట పాటు గాలిలో చక్కర్లు కొట్టింది. ఆ తరువాత విమానాన్ని తిరిగి బెంగళూరు ఎయిర్ పోర్టులో లాండ్ అయ్యింది. ఈ విమానంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు తదితర విఐపీలు ఉన్నారు. అయితే వాతావరణ సమస్యా లేక సాంకేతిక సమస్య అనే విషయంపై సిబ్బంది స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రయాణీకులు ఆందోళన చెందారు. ఇండిగో సిబ్బంది సమాధానంపై ప్రయాణీకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
YCP MLA RK Roja: సాంకేతిక సమస్యతో గంట పాటు గాలిలో చక్కర్లు
ఈ సందర్భంలో రోజా మీడియాతో ఫోన్ లో మాట్లాడారు. తాను ప్రయాణిస్తున్న ఇండిగో విమానం సాంకేతిక లోపం కారణంగా బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ చేశారని తెలిపారు. కానీ అక్కడ అనుమతి ఉందో లేదో తెలియదని తెలిపారు. డోర్లు కూడా ఓపెన్ చేయలేదని రోజా అన్నారు. ఆకాశంలో మేఘాలు ఎక్కువగా ఉండటం వల్ల స్వల్పంగా విమానం ఊగినట్లు తెలిపారు. సాంకేతిక లోపం ఉన్నందున బెంగళూరు ఎయిర్ పోర్టు వరకు తీసుకువచ్చామని సిబ్బంది చెప్పారని రోజా అన్నారు. బెంగళూరు వరకూ తీసుకువచ్చారంటే ఏదో మేజర్ సమస్య ఉన్నట్లు కనిపిస్తోందని తెలిపారు. సాంకేతిక సిబ్బంది పరిశీలించిన అనంతరం విమానం నుండి ప్రయాణీకులను పంపిస్తామని తెలిపినట్లు చెప్పారు. మళ్లీ విమానం తిరుపతి వెళుతుందని చెబుతున్నారనీ, కానీ ఎంత సమయం పడుతుందో స్పష్టంగా చెప్పడం లేదని ఎమ్మెల్యే రోజా తెలిపారు. అయితే విమానంలో ఉన్న ప్రయాణీకులు తమను కిందకు దింపాలని కోరుతున్నా తమకు భద్రతాపరమైన అనుమతులు వస్తే దింపుతామని సిబ్బంది చెప్పారన్నారు.
ఇండిగోపై కేసు వేస్తా
బెంగళూరులో ప్రయాణీకులు దిగేందుకు ఇండిగో సిబ్బంది అదనంగా రూ.5వేలు రుసుము డిమాండ్ చేశారు. అయితే యాజమాన్యం తప్పిదానికి తామెందుకు డబ్బులు చెల్లించాలంటూ విమాన సిబ్బందిపై ప్రయాణీకులు ఫైర్ అయ్యారు. అనంతరం బెంగళూరు నుండి గమ్య స్థానాలకు చేరేందుకు ప్రయాణీకులు సొంత ఏర్పాట్లు చేసుకున్నారు. రెండు గంటల పాటు తమకు ఏమి సమాచారం చెప్పకుండా ఆందోళనకు గురి చేసిన ఇండిగోపై కేసు వేస్తామని ఎమ్మెల్యే రోజా తెలిపారు. తరచు జరుగుతున్న విమాన ప్రమాదాలతో విమాన ప్రయాణం అంటే ఆందోళన చెందుతున్నారు.