RK Roja : వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే, ఏపిఐఐసీ చైర్ పర్సన్ రోజా స్వయంగా కబడ్డీ ఆడి యువకుల్లో ఉత్సాహాన్ని కల్గించారు. ఏపిలో ఓ పక్క పురపాలక సంఘ ఎన్నికల కోలాహాలం కొనసాగుతోంది. అన్ని పార్టీలు ప్రచార పర్వంలో ఉన్నాయి. రోజా కూడా నగరి, పుత్తూరు మున్సిపాలిటీలో స్థానిక నేతలతో కలిసి వైసీపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆదివారం తన నియోజకవర్గ పరిధిలోని నిండ్ర గ్రామంలోని జిల్లాపరిషత్ హైస్కూల్ లో కబడ్డీ పోటీల ప్రారంభోత్సవానికి రోజా వెళ్లారు. కబడ్డీ పోటీలను ప్రారంభించారు.
స్వతహాగా కబడ్డీ ఆట అంటే ఇష్టం ఉన్న రోజాను కబడ్డీ కోర్టు చూడటంతో ఆడాలన్న ఉత్సాహం కల్గింది. వెంటనే చీర ఎగట్టి గ్రౌండ్ లోకి దిగారు. యువకులతో ఉత్సాహంగా కబడ్డీ ఆడారు రోజా. రోజా కబడ్డీ ఆడటం చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురైయ్యారు. తిరువేలంగాడు – రేణిగుంట మధ్య రసవత్తరమైన పోటీ లు జరగ్గా రోజా ఇరు జట్ల తరపున ఆడి యువకులను ఉత్సాహ పరిచారు. ఓ పక్క ప్రజా ప్రతినిధిగా నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తూనే మరో పక్క జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులను రంజింపజేస్తున్న రోజా ఇప్పుడు కబడ్డీ ఆట ఆడి క్రీడాబిమానుల హృదయాలను దోచుకున్నారు. రోజా కబడ్డీ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్ లు ఆసక్తికరమైన కామెంట్స్ ఇస్తున్నారు.