YCP MLA: ఏపిలో కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. 20 వేలకు పైగా నమోదు అవుతున్నాయి. అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటూ కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నా పలువురు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే అనేక మంది ప్రజా ప్రతినిధులు, నాయకులు కరోనా బారిన పడి కోలుకున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గురువారం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రొటోకాల్ ప్రకారం నెగిటివ్ రిపోర్టు వచ్చిన ప్రజా ప్రతినిధులు మాత్రమే హజరుకావాల్సి ఉంటుంది. దీంతో ముందుగానే మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే ఈ విషయం తెలియని ఆ ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశంలో పాల్గొనేందుకు అమరావతికి బయలుదేరారు. తీరా ఆయన గుంటూరు సమీపానికి వచ్చే సరికి సచివాలయ సిబ్బంది నుండి ఫోన్ ద్వారా సమాచారం అందింది. కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపారు. దీంతో ఆయన అక్కడ నుండే వెనుతిరిగారు. హోం క్వారంటైన్ అయ్యేందుకు చెన్నై వెళ్లిపోయారు.
మరో పక్క అధికార పార్టీ ప్రజా ప్రతినిధులే కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని టీడీపీ విమర్శిస్తుంది. గురువారం అసెంబ్లీ సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో సహా పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాస్కులు ధరించకుండా హజరయ్యారు. మాస్క్ ధరించకుండా సీఎం జగన్ ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హజరైన ఫోటోలను టీడీపీ నేత నారా లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రే మూర్ఖంగా మాస్క్ పెట్టుకోకపోతే ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు మాస్కులు ఎందుకు ధరిస్తారని ప్రశ్నించారు. మాస్క్ ధరించడం తప్పనిసరి అంటూ కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చిన మీరు మాస్క్ ధరించకుండా ప్రజలకు ఏమి సంకేతాలు ఇస్తున్నారని లోకేష్ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి గారూ! మాస్క్ ధరించడం తప్పనిసరి అని మీ ఫోటో, పేరుతో కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చిన మీరు మాస్క్ ధరించకుండా ప్రజలకు ఏం సంకేతాలిస్తున్నారు? ముఖ్యమంత్రే మూర్ఖంగా మాస్క్ పెట్టుకోకపోతే, ఇక మంత్రులూ, ఎమ్మెల్యేలూ మాస్కులెందుకు ధరిస్తారు? (1/3) pic.twitter.com/cpDVwgzv0A
— Lokesh Nara (@naralokesh) May 20, 2021