ఏపి ప్రభుత్వం సుదీర్ఘకాలం తర్వాత ఆస్తి పన్ను పెంపునకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందుకోసం కొత్త జీవోలు విడుదల చేసింది. అర్బన్ ప్రాంతాల్లో ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంపుదల పద్ధతి ప్రారంభించింది. ఇదే సమయంలో చెత్త సేకరణకు కూడా పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఇప్పటికే కొనన్ని మున్సిపాలిటీలు తీర్మానాలు కూడా చేశాయి. చెత్త సేకరణ పన్ను వసూళ్లపై కొన్ని వర్గాల నుండి ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. మరో పక్క ప్రభుత్వం మాత్రం ఇది పెద్ద భారం కాబోదని చెబుతోంది.
అధికార పార్టీ నేతలను నిలదీస్తున్న ప్రజలు
గతంలో పట్టణ ప్రాంతంలో ప్రజలు పొందే అన్ని సేవలకు యూజర్ చార్జీలు చెల్లించాలనే పేరుతో మున్సిపల్ అధికారులు చెత్త సేకరణపై కూడా పన్ను విధించే ప్రతిపాదన చేయగా ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తం కావడంతో అప్పట్లో విరమించుకున్నారు. అయితే ప్రస్తుత జగన్ సర్కార్ మాత్రం చెత్త సేకరణపై పన్ను విధిస్తూ ఆదేశాలు ఇవ్వడంతో దానికి అనుగుణంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానాలు చేశారు. చెత్త సేకరణ పన్ను లక్ష్యాలను మున్సిపాలిటీలకు నిర్ధేశించారు. అధికారులు చెత్త సేకరణ పన్ను వసూలు చేస్తుండటంతో ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపీ ప్రజా ప్రతినిధులు పర్యటిస్తున్న సందర్భంలో ప్రజలు దీనిపై ప్రశ్నిస్తున్నారు.
చెత్త పన్ను వసూలు చేయవద్దు – ఎమ్మెల్యే నాని
గుడివాడ పట్టణంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటిస్తున్న సమయంలో తమకు చెత్త పన్ను చెల్లించడం భారంగా ఉందని, పన్ను చెల్లించాలని వాలంటీర్లు ఒత్తిడి చేస్తున్నారంటూ పలువురు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కొడాలి నాని .. ప్రజల నుండి చెత్త పన్ను వసూలు చేయవద్దంటూ మున్సిపల్ సహాయ కమిషనర్ ను ఆదేశించారు. చెత్త పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే గుడివాడ తొలి స్థానంలో ఉందని ఎమ్మెల్యే నానికి సహాయ కమిషనర్ తెలిపారు. రూ.16 లక్షల వసూళ్లు లక్ష్యం కాగా రూ.14 లక్షలు వసూలవుతోందని ఆయన చెప్పారు. ఇంత మాత్రం దానికి ప్రజలపై భారం వేయడం సరికాదని ఇకపై చెత్త పన్ను వసూలు చేయవద్దని ఆదేశించారు. ఇదే సందర్భంలో మరో మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానికి కొడాలి నాని ఫోన్ చేశారు. అన్నా.. చెత్త పన్ను వసూళ్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి.. ఈ విషయంలో ఒక సారి సీఎంను కలుద్దాం అని చెప్పారు. ఈ మాజీ మంత్రుల విజ్ఞప్తి చేస్తే సీఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పోలవరం ముంపు .. వైసీపీకి ముప్పు..!