నంద్యాల జిల్లా బనకాలపల్లి నియోజకవర్గ వైసీపీ నేత, ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి (46) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన హైదరాబాద్ లోని ఒ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. భగీరథరెడ్డి గత కొద్ది రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్నారు. ఆదివారం ఆయన తీవ్రమైన దగ్గుతో ఇబ్బంది పడుతుండటంతో అవుకులోని తన స్వగృహం నుండి కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఉపిరితిత్తుల్లో రక్తస్రావం అవుతుండటంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోవడంతో అరోగ్య పరిస్థితి విషమించి ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రేపు (గురువారం) నంద్యాల జిల్లా అవుకులో భగీరథరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్సీ భగీరథరెడ్డి అకాల మరణం పట్ల సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సంతాపం తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కాగా భగీరథరెడ్డి దివంగత సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు. 2003 నుండి 2009 వరకూ యూత్ కాంగ్రెస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడుగా పని చేశారు. 2007 – 08 మధ్య ఆలిండియా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు. 2019 లో తన తండ్రి చల్లా రామకృష్ణారెడ్డితో కలిసి టీడీపీని వీడి వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి కరోనా బారిన పడి 2021 జనవరి 1న మృతి చెందడంతో ఆయన కుమారుడైన భగీరథరెడ్డికి 2021 మార్చిలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. గతంలో తండ్రి, ఇప్పుడు తనయుడు ఇద్దరూ పూర్తికాలం ఎమ్మెల్సీ టర్మ్ పూర్తి కాకుండానే అకాల మరణం చెందడం గమనార్హం. చల్లా భగీరథరెడ్డి కి భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. భగీరథరెడ్డి కన్నుమూతతో అవుకు మండలంతో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?