కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కరోనా కాటుకు బలైయ్యారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. చల్లా మృతితో నూతన సంవత్సరం వేడుకల మొదటి రోజు ఆ ఇంట విషాదం నెలకొంది.
కర్నూలు జిల్లా అవుకు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన చల్లా రామకృష్ణారెడ్డి 1983 పాణ్యం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత 1989 లో డోన్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయారు. 1991లో నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. 1994లో కోవెలకుంట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువత వరుసగా 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కోవెలకుంట్ల అసెంబ్లీ స్థానం కనుమరుగు అయ్యింది. ఈ నియోజకవర్గంలోని డొర్నిపాడు, ఉయ్యూలవాడ మండలాల ఆళ్లగడ్డలో, కోవెలకుంట్ల, అవుకు, సంజామల, కొలిమిగుండ్ల, బనగాలపల్లి మండలాలతో బనగాలపల్లి నియోజకవర్గం ఏర్పడింది. ఆ ఎన్నికల్లో బనగాలపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో పరాజయం పాలైయ్యారు.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి సీటు లభించకపోవడంతో టీడీపీలో చేసి ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించారు. దీంతో చల్లా రామకృష్ణారెడ్డికి టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు.. సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్ పదవి అప్పగించారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో చల్లా రామకృష్ణారెడ్డి ఆ పదవికి, టీడీపీకి రాజీనాామా చేసి వైసీపీలో చేరారు. బనగాలపల్లి వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గెలుపునకు చల్లా విశేష కృషి చేశారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. .