YCP MP Mopidevi: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఓ తీవ్రమైన వ్యాఖ్యను పురస్కరించుకుని వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ మరణంలో చంద్రబాబు కుట్ర ఉందేమోనన్న అనుమానాలు బలపడేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు మోపిదేవి వెంకట రమణ. వైఎస్ఆర్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఘటనకు సంబంధించి అనుమానితుల్లో చంద్రబాబు ఒకరని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు గత మూడు రోజులుగా వరద ప్రభావిత జిల్లాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వరద బాధితులను పరామర్శిస్తూ ప్రభుత్వాన్ని, సీఎం వైఎస్ జగన్ ను విమర్శిస్తున్నారు.
రాయలసీమలో మూడు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లితే వైఎస్ జగన్ వరద బాధితులను పరామర్శించకుండా ఏరియల్ సర్వే చేసి మిన్న కుండి పోవడాన్ని ఉద్దేశిస్తూ.. ”గాలిలో ఎగిరి గాలిలో కలిసిపోతావు” అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై మోపిదేవి తీవ్రంగా స్పందిస్తూ..వైఎస్ఆర్ మరణంలో చంద్రబాబు కుట్ర ఉందా అనే అనుమానాలకు మరింత బలం చేకూరుతోందన్నారు. ఏ ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన పై అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారో చెప్పాలని మోపిదేవి డిమాండ్ చేశారు.
YCP MP Mopidevi: 2009 సెప్టెంబర్ 2న ప్రమాదం
2009 సెప్టెంబర్ 2న సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది. అనాడు రచ్చబండ కార్యక్రమానికి వెళుతుండగా హెలికాఫ్టర్ ప్రమాదానికి గురవ్వడంతో వైఎస్ఆర్ తో సహా మొత్తం అయిదుగురు మరణించారు. ఆనాడు హెలికాఫ్టర్ ప్రమాదంపై అనేక అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానాల నేపథ్యంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వైఎస్ఆర్ అభిమానులు రిలయన్స్ పెట్రోల్ బంక్ లపై దాడులు చేశారు. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలు విమాన ప్రమాదంపై అనేక రకాలుగా విచారణ చేసి ఆ ఘటన ప్రమాద వశాత్తు జరిగిందేనని తెల్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చంద్రబాబుపై ఆ ఘటనను పురస్కరించుకుని అనుమానం వ్యక్తం చేస్తూ మోపిదేవి సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.