YCP : వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణం రాజు ఢిల్లీలో కూర్చుని నిత్యం రచ్చబండ పేరుతో వైసీపీపైనా, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పైనా విమర్శలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వైసీీపీ ప్రభుత్వాన్ని, జగన్ ను ఇరుకున పెట్టేలా విమర్శలు, ఆరోపణలు చేస్తూ వారి కంటి కింద నలుసుగా మారారు. రఘురామ కృష్ణం రాజును పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న అభియోగంతో సస్పెండ్ చేస్తే వెంటనే స్వతంత్ర అభ్యర్థిగా అధికార బీజేపీ కండువా కప్పుకుంటారని భావిస్తున్న వైసీపీ ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయడం లేదు.
పార్లమెంటరీ సభ్యత్వమే రద్దు చేయించి ఇంటికి పంపించాలన్న ఆలోచనతో గతంలోనే లోక్ సభ స్పీకర్ ఓం బిల్లాకు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే దానిపై ఇంత వరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో రఘురామకృష్ణం రాజు మరింత రెచ్చిపోయి తమ పార్టీ నాయకుడు, తమ పార్టీ సభ్యులు అంటూనే వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు.
ఈ పర్యవసానాల నేపథ్యంలో రఘురామకృష్ణం రాజు చేసిన పలు వ్యాఖ్యలను పురస్కరించుకుని నరసాపురం నియోజకవర్గంలోని పలు పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసులను నమోదు చేశారు. తాను నియోజకవర్గంలో అడుగు పెడితే ఏదో విధంగా అరెస్టు చేసి జైలుకు పంపాలన్న కుట్రతో కేసులు నమోదు చేయించారనీ, దీని వెనుక తాడేపల్లి పెద్దల హస్తం ఉందంటూ రఘురామకృష్ణం రాజు ఆరోపించారు. ఈ కేసులపై రఘురామకృష్ణం రాజు హైకోర్టును ఆశ్రయించి ఆ కేసులలో అరెస్టుల నుండి మినహాయింపు పొందారు. ఏడాది కాలంగా తాను తన నియోజకవర్గంలోకి అడుగుపెట్టలేని పరిస్థితి ఉందంటూ పార్లమెంట్ సాక్షిగానే రఘురామకృష్ణం రాజు వాపోయారు. ఇవన్నీ ఇలా ఉండగా రఘురామకృష్ణం రాజుపై చెన్నై ఎస్ బీ ఐ మేనేజర్ ఫిర్యాదు మేరకు తాజాగా సీబీఐ కేసు నమోదు చేసింది. ఫోర్జరీ సంతకాలతో రుణాలు తీసుకుని రుణాలను ఎగవేశారన్న అభియోగం రఘురామకృష్ణం రాజుపై చేశారు. గతంలోనూ రఘురామకృష్ణం రాజుపై సీబీఐ కేసు నడుస్తున్నది. తాజాగా నమోదైన సీబీఐ కేసుపై రఘురామకృష్ణంరాజు తీవ్రంగా స్పందిస్తూ…మరో మారు వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.
YCP : ఆయన ఏమన్నారంటే..
ఫోర్జరీ సంతకాలతో రుణాలు తీసుకుని మోసం చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. దీని వెనుక ఏపి సీఎంఓ అధికారుల పాత్ర, వైసీపీ ఎంపిల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. వీరు బ్యాంకు మేనేజర్ పై ఒత్తిడి తీసుకువచ్చి తనపై బలవంతంగా కేసు పెట్టించారని రఘురామకృష్ణం రాజు పెద్ద ఆరోపణ చేశారు. ఏపి సీఎంఓ అధికారులు, బ్యాంకు మేనేజర్ కాల్ డేటా బయటకు తీస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందువల్లనే తనను ఏదో రూపంలో ఇరుకున పెట్టాలన్న కుట్రతో ఇదంతా చేశారనీ అంటున్నారు రఘురామకృష్ణం రాజు.