YCP MP Vijayasai Reddy: విశాఖ పరిపాలనా రాజధాని కావడం ఖాయమని మరో సారి స్పష్టం చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. గురువారం విశాఖలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తల్లకిందులుగా తపస్సు చేసినా విశాఖను పరిపాలనా రాజధానిగా కాకుండా అడ్డుకోలేరని అన్నారు. ఏపిలో మూడు రాజధానుల అంశం పై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. అమరావతిలోనే రాజధాని అభివృద్ధి చేయాలని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా మూడు రాజదానుల విధానంపైనే వైసీపీ కట్టుబడి ఉందంటూ ఆ పార్టీ నేతలు చెబుతూనే ఉన్నారు. సాంకేతిక కారణాలు చూపి మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కు తీసుకున్నా.. పకడ్బందీగా మరో సారి బిల్లు తీసుకువస్తామని గతంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చెప్పారు. అయితే హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం ఇంత వరకూ సుప్రీం కోర్టులో సవాల్ చేయకపోవడం, అసెంబ్లీలో కొత్తగా బిల్లును తీసుకురాకపోవడంతో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ తరుణంలో విజయసాయి రెడ్డి ఎవరు ఆపినా విశాఖ కు పరిపాలనా రాజధాని అగదని మరో సారి స్పష్టం చేశారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదే క్రమంలో రాష్ట్రపతి ఎన్నిక వ్యవహారంలో వైసీపీ స్టాండ్, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి ఇష్యూ పై కూడా మాట్లాడారు విజయసాయిరెడ్డి. కాలువలు, చెరువులు, నదులు అక్రమించే హక్కు ఎవరికీ లేదని అన్నారు విజయసాయిరెడ్డి. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు కాలువను ఆక్రమించారని అధికారుల వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయనీ, ప్రస్తుతానికి అయన్న పాత్రుడు హైకోర్టులో తాత్కాలిక స్టే తెచ్చుకున్నప్పటికీ ఆ విషయాన్ని తర్వాత అధికారులు చూసుకుంటారని పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ మద్దతు ఎవరికి ఇవ్వాలన్న విషయంపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న విజయసాయిరెడ్డి … ఈ విషయంలో పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అయినా అణగారిన వర్గాలకు అత్యున్నత పదవులు ఇస్తామంటే ఎవరు కాదంటారు అని పరోక్షంగా ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు తాము మద్దతు ఇస్తామన్నట్లుగా వ్యాఖ్యానించారు. ద్రౌపది ముర్మును ఎన్ డీ ఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించిన అనంతరం విజయసాయిరెడ్డి ఆమెను కలిసి అభినందనలు తెలియజేసిన సంగతి తెలిసిందే.