ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్, బీజేపీ సంయుక్త వైఫల్యం వల్లే ఏపీకీ తీవ్ర అన్యాయం జరిగిందనీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి ఆరోపించారు. రాజ్యసభలో ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో వైసీపీ తరపున ఎంపీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా, మూడు రాజధానులు, జనభా ప్రాతిపదికపై బీసీ లకు రిజర్వేషన్లు, చట్టసభలో మహిళలకు రిజర్వేషన్లు వంటి అంశాలపై ప్రసంగించారు. ఏపి విభజన అన్యాయంగా జరిగిందన్నారు. పార్లమెంట్ తలుపులు మూసి బీల్లు పాస్ చేశారనీ, ప్రత్యేక హోదా ఇస్తామన్న వాగ్దానాన్ని బీజేపీ కూడా మర్చిపోయిందని విజయసాయి విమర్శించారు.

పదేళ్లు ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారనీ, అందుకు కాంగ్రెస్ కూడా అంగీకరించిన విషయాన్ని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పటికీ కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి .. కానీ ప్రభుత్వం అనేది కొనసాగింపు అని, ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని విజయసాయి అన్నారు. ఇప్పటికైనా పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
హోదా విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేసినందునే కాంగ్రెస్, బీజేపీలకు ఏపి ప్రజలు బుద్ది చెప్పారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందనీ, బీజేపీకి అర శాతం ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ చెబుతోందనీ, కానీ ప్రత్యేక హోదా వచ్చే వరకూ తమ పోరాటం కొనసాగి తీరుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు తీసుకువచ్చామనీ, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నది తమ ధ్యేయమని స్పష్టం చేశారు. అయితే రాజధాని నిర్ణయించే అధికారం లేదని హైకోర్టు చెప్పి తన పరిధిని అతిక్రమించిందని అన్నారు. రాజధాని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని, కేంద్ర ప్రభుత్వం సైతం ఈ విషయాన్ని పార్లమెంట్ లో స్పష్టం చేసిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానాలకు రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని హరించే అధికారం లేదని అన్నారు విజయసాయి రెడ్డి.
రాజధాని అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశమనీ, రాజధాని ఏ ప్రాంతంలో ఉండాలనేది రాష్ట్రాలు నిర్ణయించుకుంటాయని విజయసాయిరెడ్డి తెలిపారు. యూపీ, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలను ఉదాహరణగా ప్రస్తావించారు విజయసాయి రెడ్డి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సెక్రటేరియట్ లక్నోలో ఉంటే అలహాబాద్ లో హైకోర్టు ఉందని అన్నారు. మరి ఏపి విషయంలో ఎందుకు వివక్ష చూపిస్తున్నారని ప్రశ్నించారు. వైజాగ్ మెట్రోకు కేంద్రం నిధులు ఇవ్వలేదని అన్నారు. ఏపిపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయసాయి రెడ్డి.
YS Jagan: వైజాగ్ మకాం షిప్ట్ చేసిన వెంటనే .. బస్సు యాత్రకు ప్లాన్..?