ఏపి ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేసిందనీ, మరో శ్రీలంక పరిస్థితికి చేరుకుంటుంది టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు ఆ ఆరోపణలను ఖండిస్తూ ఏపి అప్పుల పరిస్థితిని వివరిస్తూ వస్తున్నారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలను ఎప్పటికప్పుడు నేతలు ఖండించాలని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఆదేశించిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు వివరణలు ఇస్తూ ఉన్నారు. తాజాగా రాష్ట్రాల అప్పులపై కేంద్రం కూడా మాట్లాడిన నేపథ్యంలో ఢిల్లీలో వైసీపీ ఎంపీలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఏపిలో ఆర్ధిక పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. వైఎస్ జగన్ లాంటి సమర్ధ నాయకత్వం చేతిలో ప్రభుత్వం పని చేస్తొందని అన్నారు. ఏపి ఆర్ధిక పరిస్థితిపై చంద్రబాబు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
అసలు రాష్ట్రాల విషయంలో కేంద్రం తీరు సరిగా లేదని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఒక రకంగా కేంద్రం కంటే ఏపి పరిస్థితే ఆర్ధికంగా మెరుగ్గా ఉందన్నారు. 2021 – 22 సంవత్సరంలో కేంద్రం జీడీపీ శాతంగా ఉండగా, ఏపి జీడీపీ అయిదో స్థానంలో ఉందన్నారు. ఎగుమతుల్లో ఏపి ఎంతో అభివృద్ది సాధించింది కానీ కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చే పన్నుల ఆదాయం తగ్గిందన్నారు. కేంద్రానికి పన్నులు ఆదాయం పెరిగినా రాష్ట్రాలకు మాత్రం సరైన వాటా ఇవ్వడం లేదని అన్నారు. 41 శాతం పన్నుల వాటా కేంద్రం ఇస్తున్న దాంట్లో వాస్తవం లేదని చెప్పారు. సెస్, సర్ చార్జీలు కేంద్రం ఏటా పెంచుతోంది కానీ ఆ ఆదాయం మాత్రం కేంద్రం ఇవ్వడం లేదన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. రాష్ట్రాల అప్పుల గురించి మాట్లాడుతున్న కేంద్రం.. తన అప్పుల సంగతి ఏం చేబుతుందని విజయసాయి రెడ్డి నిలదీశారు.
2014 – 19లో కేంద్రం అప్పులు 60 శాతం పెరిగితే, చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 117 శాతం అప్పులు పెరిగాయన్నారు. కేంద్రం 2019 నుండి ఇప్పటి వరకు 50 శాతం అప్పులు చేస్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 42 శాతం అప్పులు మాత్రమే పెరిగాయని చెప్పారు. నాటి చంద్రబాబు ప్రభుత్వం అయిదుగురు కోసం పని చేస్తే.. వైసీపీ ప్రభుత్వం అయిదు కోట్ల మంది ప్రజల అభివృద్ధికి పని చేస్తోందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.