ఏపి సీఎం వైఎస్ జగన్ – ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మధ్య తేడా ఇది అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరో సారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఇటీవల అజాదీగా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుతో ఓ ఐదు నిమిషాలు మోడీ పక్కకు తీసుకువెళ్లి మాట్లాడటంతో టీడీపీ అనుకూల మీడియాలో టీడీపీ, బీజేపీ మధ్య మళ్లీ మైత్రి చిగురిస్తొందని వచ్చిన వార్తలపై విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో ఇంతకు ముందే విమర్శించారు. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన ఏపి సీఎం వైఎస్ జగన్ ను లంచ్ విందులో ప్రధాని మోడీ ఆహ్వానించగా, మోడీతో కలిసి లంచ్ లో పాల్గొన్న జగన్ దాదాపు గంట సేపు పాల్గొన్నారు. ఈ విషయంపై విజయసాయి రెడ్డి వరుస ట్వీట్ లు చేశారు.
నీతి ఆయోగ్ లంచ్ లో ప్రధాని కోసం ఏర్పాటు చేసిన టేబుల్ నెం.1 కు ఆహ్వానితులుగా ముగ్గురు సీఎంలు, ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్ లు ఉన్నారని, వారిలో ఏపి సీఎం జగన్ ఒకరని విజయసాయిరెడ్డి వెల్లడించారు. దాదాపు గంటకు పైగా ప్రధాని మోడీతో కలిసి ఒకే టేబుల్ వద్ద విందులో మాట్లాడుకున్నా ప్రచారం కోరుకోని జగన్ స్థాయి ఎక్కడ.. నిలబడి ప్రధాని తనతో రెండు నిమిషాలు మాట్లాడినందుకు అయిదు గంటలకు సరిపడా కట్టుకథ అల్లిన బాబు, ఆయన పచ్చకుల మీడియా ఎక్కడ అంటూ విజయసాయి రెడ్డి విమర్శించారు.
ప్రజల్లో స్వయం ప్రకాశం లేని బాబు..1994లో వెన్నుపోటుతో అధికారం లాక్కుని, 1999లో కార్గిల్ యుద్ధం వల్ల, 2014లో మోడీ గారి హవాలో అధికారంలోకి రావడం తప్పితే.. సొంతంగా ఒక్కసారి కూడా గెలిచింది లేదు అని ఎద్దేవా చేశారు. ఇలాంటి వారిని ఇంగ్లీషులో “ఫేరసైట్స్” అంటారని, అంటే పరాన్న జీవులు అని వివరించారు విజయసాయిరెడ్డి. ఢిల్లీలోని అన్ని పార్టీల ఇళ్లలో తిని, అందరి వాసాలు లెక్కపెట్టిన ఈ చంద్రబాబు అనే ద్రోహిని ఎవరైనా మళ్లీ కలుద్దాం, మా ఇంటికి రండి అని ఎందుకు అంటారు అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.