ఏపీలో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంశాల జాబితా తీస్తే అందులో దేవాలయాల్లో జరుగుతున్న అమానుష ఘటనలు, ఏపీ మాజీ మంత్రి , తెలుగుదేశం పార్టీ నాయకురాలు భూమా అఖిలప్రియ అరెస్టు , అదే సమయంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. ఔను. స్థానిక సంస్థలు ఎన్నికలతో ఏపీ రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి
నిమ్మగడ్డ సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశలుగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటించారు. స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల చేసేశారు. అయితే, దీనిపై చర్చోపచర్చలు , రాజకీయ విమర్శలు చెలరేగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యుల్ విడుదల చేయడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించబోమని ఉద్యోగ సంఘాల ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఉద్యోగుల, ప్రభుత్వం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని ఉద్యోగ సంఘాలు ప్రశ్నించాయి. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎన్నికల కమిషన్ షెడ్యుల్ విడుదల చేసిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి . ఎన్నికల కమిషన్ కు తాము సహకరించమని ఉద్యోగులు తేల్చి చేప్పేశారు. వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలను నిర్వహించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం ఊహించని అడుగు
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ఏపీ ఎస్ఈసీ విడుదల చేయడంతో ఏపీ సర్కార్ హౌస్ మోషన్ పిటిషన్ ధాఖలు చేసింది . శనివారం నుంచి హైకోర్టుకు సెలవులు కావడంతో… హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. హౌస్ మోషన్ పిటిషన్ సోమవారం నాడు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది . ఇదిలా ఉండగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఈసీ, చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రమేష్ కుమార్ ఎన్నికల సంఘాన్ని చంద్రబాబుకు జేబు సంస్థ గా మార్చటం దురదృష్టకరమన్నారు. ఉద్యోగులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని… ఎన్నికల నిర్వహణ క్రమంలో ఉద్యోగుల్లో ఎవరికైనా కోవిడ్ వచ్చి చనిపోతే బాధ్యత ఎవరిది? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ద వ్యవస్థ ఇలా అప్రజాస్వామికంగా వ్యవహరించటం దురదృష్టకరమని.. సభలు, సమావేశాలకు హాజరవ్వాలా వద్దా అన్నది ఆప్షన్ అని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో ఎన్నికలను ఎందుకు ఎన్నికలను నిర్వహించలేదు? రాష్ట్ర ప్రభుత్వంతో తగాదా పెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో నిమ్మగడ్డ ఉన్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని… లోకేష్ ఇప్పటికీ కోవిడ్ తో భయం భయంగా వస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా, ప్రభుత్వం ఇలా సంచలన నిర్ణయంతో ముందుకు సాగుతున్న తరుణంలో ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది.