టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తున్న మాదిరిగా ప్రజలకు హామీలను గుప్పించారు. తనను అనేక రకాలుగా అవమానాలకు గురి చేయడంతో పాటు చివరకు తన భార్యను అవమానించే పరిస్థితికి వచ్చారనీ, అందుకే అసెంబ్లీ నుండి వచ్చేశాననీ, ప్రజాక్షేత్రంలో గెలిచాకే అసెంబ్లీలో అడుగుపెడతాననీ చెప్పాననీ, ఇక తనను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేననీ, ఇవే తనకు చివరి ఎన్నికలని, ఇప్పుడు గానీ గెలిపించుకోలేకపోతే మళ్లీ రాజకీయాల్లో కనిపించననే విధంగా చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు , మంత్రులు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి తాను ఏం చేశాడో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి కానీ మీరే నన్ను అసెంబ్లీకి పంపించండి .. లేదంటే ఇవే చివరి ఎన్నికలు అని చంద్రబాబు మాట్లాడుతున్నారంటే ఆయన పరిస్థితి ఎంటో అర్ధమైందని వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ చార్జి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు తల్లకిందులుగా తపస్సు చేసినా ప్రజలు ఆయనను నమ్మరని వైవీ అన్నారు. కర్నూలు సభలో చంద్రబాబు మాట్లాడిన మాటలను వైవీ తప్పుబట్టారు. ఇవే చివరి ఎన్నికలు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ వాస్తవమేనని, 2024 ఎన్నికలే టీడీపీకి, చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
చంద్రబాబు మాటలను బట్టి చూస్తే ఎన్నికలకు ఏడాదిన్నర ముందే తన ఓటమిని అంగీకరించారని తెలిపారు. సానుభూతి కోసం చంద్రబాబు డ్రామాలు మొదలు పెట్టారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మూడు సార్లు ప్రజలు అవకాశం ఇస్తే మోసం చేశారని అన్నారు. అసెంబ్లీలో ఆయన భార్యను ఎవరూ కించపరచలేదని బొత్స పేర్కొన్నారు. చంద్రబాబు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని బొత్స అన్నారు. చంద్రబాబు తనకి చివరి ఎన్నికలు అన్నాడు.. ఆయన కోరిక తప్పక తీరుతుంది. దేవుడు తథాస్తు అంటారు అని బొత్స సెటైర్ వేశారు. మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు అని, ఆ విషయం ప్రజలకు ఎప్పుడో తెలుసుననీ, చంద్రబాబుకే ఆలస్యంగా తెలిసిందని, ఇప్పటికే కుప్పం చేజారిపోయిందని అన్నారు.
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తన ఓటమిని అంగీకరించారని మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు. ఎవర్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు పోటీ చేయకపోతే రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదని ఎద్దేవా చేశారు మంత్రి అమరనాథ్. మరో మంత్రి సిదిరి అప్పలరాజు స్పందిస్తూ బాబు జీవితం శనక్కాయ బస్తాల దొంగతనంతో ప్రారంభమైందని విమర్శించారు. భార్యని అడ్డుపెట్టుకుని ఎంత కాలం రాజకీయం చేస్తారని ప్రశ్నించారు. ఇవే చివరి ఎన్నికలు అనడం ద్వారా చంద్రబాబే టీడీపీకి సమాధి కడుతున్నారని మంత్రి అప్పలరాజు అన్నారు.
ఓటమిని చంద్రబాబు ఏడాదిన్నర ముందే అంగీకరించారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు బైబై అన్నారు. వచ్చే ఎన్నికల్లో గుడ్ బై బాబు అంటారని అంబటి వ్యాంగ్యాస్త్రాలను సంధించారు. చంద్రబాబుకు 40 ఏళ్ల అనుభవం చివరికి పిచ్చి పిచ్చిగా మాట్లాడటానికి ఉపయోగపడిందనీ, ఆయన మానసికంగా ఫిట్ గా లేరని అది ఆయన మాటలు, చేష్టల ద్వారానే తెలుస్తూనే ఉందని అన్నారు.