ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి గా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏపికి చెందిన అధికార వైసీపీ, విపక్ష టీడీపీ లు ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించాయి. ఇందుకు ఆయా పార్టీలు తొలిసారిగా గిరిజన మహిళకు రాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చినందుకు సామాజిక న్యాయ సిద్ధాంతంతో మద్దతు తెలియజేస్తుట్లు ప్రకటించాయి. ద్రౌపది ముర్ము ఏపి పర్యటనకు విచ్చేసి మద్దతు ఇచ్చినందుకు ఇరుపార్టీలకు కృతజ్ఞతలు తెలిపి వెళ్లారు.
రెండు పార్టీలు అధికారికంగా ఎన్డీఏ మిత్ర పక్షాలు కాదు, కానీ ..
వాస్తవానికి ఈ రెండు పార్టీలు అధికారికంగా ఎన్డీఏ మిత్ర పక్షాలు కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విభజన హామీలను నెరవేర్చడం లేదు. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ బకాయిలను ఇవ్వడం లేదు. ఇలా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నా అధికార పక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి, ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబులు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చారు. సామాజిక న్యాయ సిద్దాంతంతో గిరిజన మహిళకు అవకాశం ఇవ్వడం వల్ల మద్దతు ఇస్తున్నట్లు ఈ రెండు పార్టీలు ఇప్పుడు ప్రకటించడంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు తప్పుబట్టారు. ఈ సామాజిక న్యాయం గతంలో పీఎ సంగ్మా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేసినప్పుడు గుర్తుకు రాలేదా..? అని ప్రశ్నిస్తున్నారు. ఎవరికి కహానీలు చెబుతున్నారు అని ప్రశ్నించారు. 2012లో ఎన్డీఏ అభ్యర్ధిగా పీఏ సంగ్మా. యూపీఎ అభ్యర్ధిగా ప్రణబ్ ముఖర్జీ పోటీ పడ్డారు. ఆనాడు యూపీఎ అధికారంలో ఉంది. నాడు సంగ్మా బహిరంగంగానే ప్రకటించారు. రాష్ట్రపతిగా ఒ ఎస్టీ సామాజికవర్గానికి మొదటి సారిగా పోటీ చేసే అవకాశం వచ్చింది అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే ఆ నాడు కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చిన వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి .. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సంగ్మాను కాదని యుపీఏ అభ్యర్ధి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చారు. ఆ పార్టీ ప్రజా ప్రజా ప్రతినిధులు ఆయనకు ఓటు వేశారు. ఆనాడు ఎన్డీఏ ఎస్టీ సామాజికవర్గానికి చెందిన సంగ్మాను పోటీకి నిలిపినా వైసీపీ సామాజిక న్యాయం పేరుతో మద్దతు ఇవ్వలేదు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఏపి పర్యటన విజయవంతం ..ఏపీ వైసీపీ, టీడీపీ సంపూర్ణ మద్దతు
సంగ్మా పోటీ చేసినప్పుడు టీడీపీ ఏకంగా రాష్ట్రపతి ఎన్నికలనే బహిష్కరించింది
అనాడు అధికార పక్షం నిలబెట్టిన ప్రణబ్ ముఖర్జీకి వైసీపీ సపోర్టు చేసింది. ఇక టీడీపీ ఆనాడు ఎన్నికలను బహిష్కరించింది. కాంగ్రెస్ అభ్యర్ధి ప్రణబ్ ముఖర్జీని సమర్ధించలేము, బీజేపీ మతోన్మాద పార్టీ కావడం వల్ల ఆ పార్టీ నిలబెట్టిన సంగ్మాకు బలపర్చలేము అని కారణంగా చెప్పి టీడీపీ ఆ ఎన్నికలకు దూరంగా ఉంది. 2014 ఎన్నికలు వచ్చే సరికి మతోన్మాదం పోయింది. బీజేపీ – టీడీపీ మిత్రపక్షాలు అయ్యాయి. 2018 లో బీజేపీ మతోన్మాద పార్టీ అయ్యింది విడిపోయాయి. ఇప్పుడు మళ్లీ 2022 వచ్చే సరికి రాష్ట్రపతి అభ్యర్ధిగా ఓ గిరిజన మహిళను నిలబెట్టినందుకు పీఎం మోడీకి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఇప్పుడు సామాజిక న్యాయం అంటున్న టీడీపీ ఆనాడు ఎన్డీఏ అభ్యర్ధిగా పోటీ చేసిన సంగ్మాకు ఎందుకు మద్దతు ఇవ్వనట్లు. ఇప్పుడు గుర్తుకు వచ్చిన సామాజిక న్యాయం ఈ రెండు పార్టీలకు ఆనాడు ఎందుకు గుర్తుకు రానట్లో. ఈ వ్యవహారంపై విశ్లేషించిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు రెండు పార్టీలకు చురకలు అంటించారు.