YCP Vs TDP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు ఒక్క సారిగా భగ్గుమన్నాయి. వైసీపీ సర్కార్, సీఎం జగన్మోహనరెడ్డి (YS Jaganmohan reddy)పై టీడీపీ (TDP) అధికార ప్రతినిధి పట్టాభి చేసిన పరుష వ్యాఖ్యలు టీడీపీ, వైసీపీ మధ్య అగ్గిరాజేశాయి. వైసీపీ శ్రేణులు ఓ పక్క పట్టాభి ఇంటిపై, మరో పక్క మంగళగిరి టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడులు చేయడం, పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం రాష్ట్ర రాజకీయ వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పార్టీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడులు చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీపీఐ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మదు లు ఖండించారు.జరిగిన ఘటనలపై నేడు రాష్ట్ర బంద్ కు టీడీపీ పిలుపునిచ్చింది. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో రాష్ట్ర వ్యాప్తంగా అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దిగాయి.
YCP Vs TDP: అమిత్ షాకు చంద్రబాబు ఫిర్యాదు
టీడీపీ అధినేత చంద్రబాబు,. నారా లోకేష్ తదితర నేతలు వైసీపీ చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసుల సహకారంతోనే ఈ ఘటనలు జరిగాయని మండిపడ్డారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇటువంటి ఘటనలు చూడలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అప్రజాస్వామిక చర్యగా చంద్రబాబు అభివర్ణించారు. జరిగిన ఘటనపై చంద్రబాబు డీజీపీ కి ఫోన్ చేయగా స్పందించలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ చేసి రాష్ట్రంలో పరిస్థితులను వివరించినట్లు సమాచారం. మరో పక్క రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చంద్రబాబు ఫిర్యాదు చేస్తూ రాష్ట్రానికి కేంద్ర బలగాలను పంపాలని కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఆర్టికల్ 356 అమలు చేసే స్థితికి తీసుకొచ్చారంటూ చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రపతి పరిపాలన పెడితేనే బాగుంటుంది అన్న భావన కలుగుతుందన్నారు. టీడీపీ నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్ కు ప్రజా స్వామిక వాదులు అందరూ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
వివాదం ఎందుకు వచ్చిందంటే..?
గుజరాత్ లోని ముంద్రా పోర్టులో ఇటీవల భారీ ఎత్తున మాదకద్రవ్యాల పట్టివేత విషయాన్ని పురస్కరించుకుని టీడీపీ గత కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా టీడీపీ అధికార ప్రతినిది పట్టాభి తాజా ఆ అంశాన్ని పురస్కరించుకుని మరో సారి ఘాటుగా విమర్శనాస్త్రాలను సంధించారు. టీడీపీ నేత నక్కా ఆనందబాబుకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని, వైేసీపీ ప్రభుత్వాన్ని పరుస పదజాలంతో దుర్భాషలాడారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇదే క్రమంలో పట్టాభి నివాసంపై దాడి చేశారు. సామాను ధ్వంసం చేశారు. మరో పక్క టీడీపీ పార్టీ కార్యాలయంపైనా దాడికి పాల్పడ్డారు.