YCP vs TDP; తిరుపతి వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని అవమానపర్చేలా టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ ఆ పార్టీ నేతలు శుక్రవారం డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు, నారా లోకేష్ తదితరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయాలంటూ వైసీపీ ఎంపి నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కైలే అనిల్ కుమార్ లు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఈ రోజు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కౌంటర్ ఫిర్యాదు అందజేశారు. తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి అత్మాభిమానం దెబ్బతినేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని వర్ల రామయ్య పేర్కొన్నారు. ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు అందజేశారు.
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్ లలో కేసులకు కౌంటర్ కేసులు నమోదు చేయడం, ఆ తరువాత ఇరు వర్గాలు రాజీకి వచ్చి కేసులు విత్ డ్రా చేసుకోవడం జరుగుతోంటోంది. ఇప్పుడు అదే తరహాలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై వైసీపీ నేతలు అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేస్తే ప్రతిగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ నేత ఫిర్యాదు చేయడం విశేషం. ఇప్పుడు పోలీస్ యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుందనేది ఆశక్తికరంగా మారింది. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ తరుణంలో అసలు అభ్యర్థులు ఫిర్యాదులు చేయకుండా వారి తరపు నాయకులు ప్రధాన పార్టీ నేతలపై ఫిర్యాదులు చేయడం హాట్ టాపిక్ గా మారింది.