YCP Vs TDP: ఏపీ (Andhra Pradesh)లో గ్రామ స్థాయి రాజకీయాలు ఎలా ఉన్నాయో రాష్ట్ర స్థాయి రాజకీయాలు (Politics) అలానే తయారు అయ్యాయి. గ్రామాల్లో ఓ రాజకీయ పార్టీ కార్యకర్త పోలీసు స్టేషన్ కు వెళ్లి తనను ప్రత్యర్ధివర్గానికి చెందిన వ్యక్తి కొట్టాడనో, తిట్టాడనో ఫిర్యాదు చేస్తే ఆ వెంటనే బాధిత వ్యక్తిపైనే సదరు కేసులో నిందితుడు కౌంటర్ ఫిర్యాదు అందజేస్తుంటారు. పలు సందర్భాలలో ప్రత్యర్ధిపై దాడి చేసిన వ్యక్తే ముందుగా స్టేషన్ కు ఫిర్యాదు చేయడం జరుగుతుంటుంది. ఆ తరువాత బాధితుడు ఆసుపత్రిలో కట్టుకట్టించుకుని వచ్చి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడానికి వస్తే నీమీద కేసు పెట్టారని చెప్పడం జరుగుతుంటుంది. అప్పుడు ఇరుపక్షాల ఫిర్యాదులను పోలీసులు తీసుకుని ఇద్దరు రాజీ పడతారా ? రెండు కేసులు రిజిస్టర్ చేయమంటారా ?అని బెదిరిస్తే ఇరువురు రాజీపడి కేసులు వద్దూ పాడు వద్దూ అని వెళ్లిపోతుంటారు. కొందరైతే రెండు కేసులు నమోదు చేయండి కోర్టులో తేల్చుకుంటామంటారు. ఆ తరువాత లోక్ అదాలత్ లో కేసులను రాజీ చేసుకుంటారు. ఇది గ్రామాల స్థాయిలో జరుగుతున్న రాజకీయ తంతు. ఇప్పుడు అదే పరిస్థితి రాష్ట్ర స్థాయిలో వచ్చేసింది. ఓ పార్టీ నాయకుడు ఎదుటి పార్టీ నేతకు ఒక తిట్టు తిడితే అతను నాకు తిట్లు వచ్చునంటూ మరీ ఘాటుగా నోటికి పని చెప్పడం జరుగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శల స్థాయి దాటి పోయి ఇప్పుడు రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుుకునే వరకూ వెళ్లింది. పార్టీల గుర్తింపు రద్దు చేయాలంటూ వైసీపీ, టీడీపీ ఫిర్యాదులు చేసుకోవడం ఇప్పడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
Read more: Telangana Leaders Padayatra: తెలంగాణలో పాదయాత్రకు సిద్దమైన మరో నేత..! ఎందుకంటే..?
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (పట్టాభి) ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, వైసీపీలోని ఓ ముఖ్యనేతపై పరుష పదజాలంతో దుర్భాషలాడిన సంగతి తెలిసిందే. పట్టాభి వ్యాఖ్యలపై ఆవేశానికి లోనైన వైసీపీ అభిమానులు పట్టాభి ఇంటిపై దాడి చేశారు. కొందరు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపైనా దాడి చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష చేయడంతో పాటు టీడీపీ ప్రతినిధి బృందంగా ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలిసి రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందనీ, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ డిమాండ్ చేశారు. ఆ మేరకు వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ తరుణంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైనే అన్ పార్లమెంటరీ ల్యాంగ్వేజ్ లో దుర్భాషలాడారని వైసీపీ నేతలు ఆరోపిస్తూ టీడీపీ పై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి నేతృత్వంలో వైసీపీ నేతల బృందం మూడు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు అందించారు. టీడీపీ నేతలు ఉన్మాదుల్లా, ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఇలాంటి దొంగల ముఠాకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదు. అందుకే టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని ఎలక్షన్ కమిషన్ ను కోరాం.అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
Read More: AP SEC: నెల్లూరు కార్పోరేషన్ సహా 12 మున్సిపాలిటీల ఎన్నికలకు షెడ్యుల్ విడుదల చేసిన ఎస్ఈసీ
ఇది ఇలా ఉంటే తాజాగా టీడీపీ ఎంపీలు నిన్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వైసీపీపై ఫిర్యాదు చేశారు. టీడీపీ ఎంపిలు కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్, మాజీ ఎంపి నిమ్మల కృష్ణప్పలు ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి వైసీపీ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరారు. 12 కేసుల్లో చార్జిషీట్లు ఎదుర్కొంటున్న జగన్మోహనరెడ్డి జైలుకు వెళ్లి బెయిల్ పై బయట ఉన్నారని ఈసీకి తెలియజేశామన్నారు కేశినేని,. ఆ పార్టీ నేతలతో బూతులు తిట్టిస్తున్నారనీ, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారనీ, అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారంటూ ప్రశ్నించారు. ఇలా టీడీపీ రిజిస్టేషన్ రద్దు చేయాలని వైసీపీ నేతలు, వైసీపీ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసుకోవడం జరిగింది.ఇప్పుడు ఈసీ ఏమి చేస్తుందో మీరే చెప్పండి.