YCP Vs TDP: మూడు రోజులుగా ఉత్కంఠతను రేపుతున్న కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వివాదం ముగిసింది. హైకోర్టు ఆదేశాలతో బుధవారం కొండపల్లి మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ హాలులో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికను ఎన్నికల అధికారి నిర్వహించారు. వైసీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో రెండు రోజులుగా చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక వాయిదా పడిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ రోజు పూర్తి భద్రత నడుమ ఎన్నికను నిర్వహించారు. దీంతో వైసీపీ కౌన్సిలర్ లు నిన్న మొన్న చేసిన విధంగా గందరగోళం చేయకుండా తమ స్థానాలకు పరిమితం అయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని వీడియో షూటింగ్ తీసి మరీ నిర్వహించారు.
YCP Vs TDP: మెజార్టీ నిరూపించుకున్న టీడీపీ..?
తొలుత ఎన్నికల్లో గెలిచిన వైసీపీ, టీడీపీ అభ్యర్ధులతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్, రెండు వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక నిర్వహిస్తుండగా ఎక్స్ అఫిషియో సభ్యుడుగా ఓటింగ్ లో పాల్గొన్న మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్..ఫలితం వెంటనే ప్రకటించవద్దని హైకోర్టు చెప్పిన కారణాన్ని చూపుతూ సీక్రెట్ ఓటింగ్ పెట్టాలని ఎన్నికల అధికారిని కోరారు. అయితే మున్సిపల్ యాక్ట్ లో సీక్రెట్ ఓటింగ్ జరపాలని లేదనీ, చేతులు ఎత్తే చైర్మన్ ను ఎన్నుకునే ప్రక్రియనే చేపట్టాలని టీడీపీ సభ్యులు కోరారు. దీంతో మున్సిపల్ యాక్ట్ ప్రకారం చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నికను నిర్వహించారు. చైర్మన్ గా టీడీపీ సభ్యుడు చెన్నుబోయిన చిట్టిబాబును ఆ పార్టీ సభ్యులు బలపరిచారు. టీడీపీ సభ్యులు 14 మంది, ఒక స్వతంత్ర అభ్యర్ధి, ఎంపి కేశినేని నాని ఓటుతో టీడీపీ మెజార్టీ వచ్చింది. వైస్ చైర్మన్ గా చుట్టుకుదురు శ్రీనివాసరావు, మరో వైస్ చైర్మన్ గా కరిపికొండ శ్రీలక్ష్మికి టీడీపీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఎక్స్ అఫిషియో సభ్యుడు విజయవాడ ఎంపి కేశినేని నాని ఓటుతో టీడీపీ కి 16, వైసీపీకి 15 ఓట్లు వచ్చాయి.
కొండపల్లి ఫలితం రేపు హైకోర్టుకు
వైసీపీ తరపున ఎన్నికైన 14 మందికి తోడు ఎక్స్ అఫిషియో కోటాలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి ఓటు వేశారు. ఒక్క ఓటు తేడాతో టీడీపీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుంది. అయితే హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల అధికారులు ఫలితాలను ప్రకటించలేదు. ఫలితాన్ని రేపు హైకోర్టుకు రిటర్నింగ్ అధికారి తెలియజేయనున్నారు. టీడీపీ ఎంపి కేశినేని నానికి ఎక్స్ అఫిషియో ఓటు కల్పించడాన్ని వైసీపీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎంపి కేశినేని నాని ఎక్స్ అఫిషియో సభ్యుడుగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం ఇచ్చిన తీర్పును వైసీపీ డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. ఇక ఇప్పుడు డివిజన్ బెంచ్ తీర్పుపై ఆసక్తి నెలకొంది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధిస్తే ఇష్యూ క్లోజ్ అయినట్లే. వివాదం సద్దుమణిగినట్లే. కానీ ఒక వేళ ఎంపీకీ వ్యతిరేకంగా తీర్పు వస్తే మళ్లీ వివాదం మొదటికి వస్తుంది. టీడీపీ 15 – వైసీపీ 15 ఓట్లతో టై అవుతుంది. అప్పుడు అధికారులు ఏమి చేస్తారో చూడాలి మరి.