YCP Vs TDP: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, మంత్రులపై మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయ్యన్న వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు మాజీ మంత్రి చంద్రబాబు నివాసం ముట్టడికి రావడం ఉద్రిక్తతలకు దారి తీసింది. చంద్రబాబు నివాసానికి వచ్చిన జోగి రమేష్ ను టీడీపీ నేతలు బుద్దా వెంకన్న తదితర టీడీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల నాయకులు పరస్పరం నినాదాలు, దూషణలతో అక్కడ పరిస్థితి రణరంగంగా మారింది. పోలీసులు బారికేడ్లను పెట్టి ఇరువర్గాలను నిలువరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో లాఠీలను ఝులిపించారు.
ఈ సందర్భంలో జోగి రమేష్, బుద్దా వెంకన్న మధ్య తీవ్వ వాగ్వివాదం జరిగింది. ఇరువర్గాల తోపులాటలో బుద్దా వెంకన్న స్వల్ప అస్వస్థతకు గురై సొమ్మసిల్లి కిందపడిపోయారు. ఇదే క్రమంలో జోగి రమేష్ కార్యకర్తలతో రోడ్డుపై భైటాయించి నిరసన తెలిపారు. చంద్రబాబు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. రాళ్ల దాడిలో జోగి రమేష్ కారు అద్దాలు ద్వంసం అయ్యాయి. ఘర్షణ మరింత ముదురుతున్న క్రమంలో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి జోగి రమేష్ ను అరెస్టు చేసి తీసుకువెళ్లారు.
శాంతియుతంగా నిరసన తెలియడానికి వస్తే తమపై చంద్రబాబు దాడి చేయించారంటూ జోగి రమేష్ ఆరోపించారు. చంద్రబాబు క్షమాపణ చెప్పకుంటే రాష్ట్రంలో తిరిగనివ్వమని జోగి హెచ్చరించారు. చంద్రబాబు నివాసంపైకి జోగి రమేష్ కార్యకర్తలతో దౌర్జన్యంగా వచ్చి దాడికి పాల్పడ్డారని బుద్దా వెంకన్న, పట్టాభి, గద్దె రామ్మోహన్ తదితర నేతలు ఆరోపణ చేశారు. జోగి రమేష్ ముందుగా చంద్రబాబు ఇల్లు మట్టడిస్తామని సోషల్ మీడియాలో పోస్టు చేసినా పోలీసులు నిలువరించలేదని టీడీపీ నేతలు ఆరోపించారు. తమపైనే దాడి చేశారంటూ టీడీపీ, వైసీపీ శ్రేణులు ఆరోపణలు చేసుకున్నారు.