AP Legislative Council: ఏపి శాసనమండలిలో లెక్కలు మారుతున్నాయి. మండలిలోనూ వైసీపీ హవా కొనసాగే పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీకి అసెంబ్లీలో తిరుగులేని మెజార్టీ ఉన్నా మండలిలో టీడీపీ అధిక్యత ఉండటంతో ఇప్పటి వరకూ కీలక బిల్లుల విషయంలో అధికార పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూ వచ్చాయి. ఈ రోజు నుండి ఆ పరిస్థితి మారిపోయింది. నేటి నుండి మండలిలో వైసీపీ బలం పెరగనున్నది. ఏడుగురు టీడీపీ సభ్యుల పదవీకాలం నేటితో ముగియనున్నది. టీడీపీ సభ్యుడు రెడ్డి సుబ్రమణ్యం, వైవీబీ రాజేంద్ర ప్రసాద్, బుద్దా వెంకన్న పప్పల చలపతిరావు, గాలి సత్యవతి, జగదీశ్వర్ రావు, వైసీపీ నుండి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నేడు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మండలిలో టీడీపీ బలం 22 నుండి 15 కి పడిపోతున్నది. ఇదే సమయంలో వైసీపీ బలం 20కి చేరనుంది. ఇటీవలే నలుగురు వైసీపీ సభ్యులను గవర్నర్ నేరుగా మండలికి నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.
Read More: Shamshabad airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో గ్యాస్ లీకేజీ..ఒకరి మృతి
తాజా పరిణామాల నేపథ్యంలో అటు అసెంబ్లీలో, ఇటు శాసనమండలి రెండింటిలోనూ వైసీపీ ఆధిపత్యం కొనసాగనున్నది. ఇప్పటి వరకూ మండలిలో తమకు ఉన్న బలంతో టీడీపీ పలు కీలక బిల్లులను అడ్డుకున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకువచ్చిన రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఆమోదం లభించకపోవడంతో గతంలో ఏకంగా శాసనమండలి రద్దుకు సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే. ఏపి శాసనమండలి రద్దు దస్త్రం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. అయితే నేడు మండలిలో అధికార పార్టీ బలం పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం.. మండలి రద్దు ప్రతిపాదనను వెనక్కు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి.