తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఏపిలో ఎంటర్ కావడంపై వైసీపీ సీనియర్ నేతలు ఇప్పటి వరకూ చాలా సాఫ్ట్ గానే స్పందించారు. ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సహా పలువురు మంత్రులు ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభావం ఏపిలో పెద్దగా ఉండదని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తామనీ గానీ, ఇవ్వమని గానీ కామెంట్స్ చేయలేదు. ఆ పార్టీకి వ్యతిరేకంగానూ విమర్శిస్తూ కూడా పార్టీ అగ్రనేతలు ఎవరూ మాట్లాడలేదు. అయితే వైసీపీ యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్, శ్యాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ఇక్కడికి (ఏపి) వచ్చి ఏదో చేసేస్తుందని తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నారనీ, ఇక్కడ ఆ పార్టీ ప్రభావం ఏమీ ఉండదని అన్నారు. జగన్ తెలంగాణకు వస్తే పెను ప్రకంపనలే అన్నారు. జగన్ అంటే స్పందించే కోట్లాది హృదయాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో ప్రతి గ్రామంలో కూడా జగన్ కు అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. వంద ప్రతిపక్ష పార్టీలు కలిసి వచ్చినా సీఎం జగన్ ను వారు ఏమి చేయలేరని సిద్ధార్ధ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్మోహనరెడ్డి ఒక్క సారి తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే అక్కడి రాజకీయాలు తలకిందులు అవుతాయని అన్నారు.
ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ జనసేన పైనా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ రంగం సినిమాలో విలన్ లాంటోడని విమర్శించారు. రాష్ట్రంలో పేద ప్రజలకు మోసం చేసింది ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబేననీ, అటువంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ మద్దతు తెలపాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పేర్లు అయినా తెలుసా అని ప్రశ్నించారు బైరెడ్డి. పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నప్పుడు మమ్మల్ని బూతులు తిట్టి, ఇక పవన్ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయనను బూతులు తిట్టేవాళ్లను చాలా మందిని చూశానని అన్నారు.