Young Girl Murder Case: గుంటూరు జిల్లా కాకాణిలో బిటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందనీ, రూ.10లక్షలు సాయం అందించాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. సోమవారం గుంటూరు జీజీహెచ్ లో బాధిత కుటుంబాన్ని కలిసిన హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రభుత్వం తరపున రూ.10 లక్షల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ రమ్యను హత్య చేసిన నిందితుడిని పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ వెంటనే స్పందించి ఆదేశాలు జారీ చేశారన్నారు. పార్లమెంట్ లో దిశ చట్టం అయితే ప్రత్యేక న్యాయస్థానాలు అందుబాటులోకి వస్తాయన్నారు. సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగానే నిన్నటి ఘటనలో నిందితుడిని అరెస్టు చేశామన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు మహిళలు, బాలికలు దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ ఘటనను పురస్కరించుకుని టీడీపీతో సహా వివిధ రాజకీయ పక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఘటన జరిగి 24 గంటల్లోపే బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుండి సాయం అందించడం విశేషం. గతంలో ఈ మాదిరిగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి సాయం అందించడం అరుదు.
Young Girl Murder Case: జీజీహెచ్ వద్ద విపక్షాల ఆందోళన
మరో పక్క గుంటూరు జీజీహెచ్ వద్ద వివిధ రాజకీయ పక్షాల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఆసుపత్రిలో రమ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అవ్వడంతో ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తరలించే ప్రయత్నం చేయగా అంబులెన్స్ ను జీజీహెచ్ నుండి కదలకుండా విపక్షాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు. రమ్యను చంపిన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జీజీహెచ్ వద్ద వామపక్షాలు సహా వివిధ పార్టీల నేతలు భైటాయించి నిరసనకు దిగారు. విపక్షాల ఆందోళన నేపథ్యంలో మరో మార్గం ద్వారా తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అక్కడా ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టారు.