YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నమ్మినబంటు అనే పేరు ఆ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు కలిగి ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయంగా వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్న నాటి నుంచి అంబటి వెంట ఉంటున్నారు. అలాంటి అంబటి తాజాగా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన కోవిడ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
జగన్ ఏమంటున్నారంటే…
కోవిడ్ వాక్సినేషన్పై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్కు ఇప్పుడు కేవలం వాక్సినేషన్ మాత్రమే ఒక పరిష్కారంగా ఉందన్న ఆయన.. వ్యాక్సినేషన్ సమస్య ఎప్పుడు తీరుతుందో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో వాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 7 కోట్లు.. వాటిలో కోటి వాక్సిన్లు కోవాగ్జిన్, మిగిలినవి కోవీషీల్డ్ అని.. ఇప్పుడు వ్యాక్సినేషన్ కొరత ఎప్పుడు తీరుతుందో తెలియదు అన్నారు. దేశంలో వ్యాక్సిన్ నిల్వలు, ఉత్పత్తి సామర్థ్యంపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. 18–45 ఏళ్ల మద్య వయస్సు వారికి సెప్టెంబరు నుంచి వాక్సీన్ ఇవ్వొచ్చని అంచనా వేసిన ఆయన.. ఆ మేరకు వారికి వాక్సినేషన్ పూర్తి కావడానికి నాలుగు నెలలు పడుతుందన్నారు.. అంటే వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి వారందరికీ వాక్సీన్ చేయగలుగుతామన్నారు.. ఇదీ వాస్తవ పరిస్థితి అని వ్యాఖ్యానించిన ఏపీ సీఎం.. కాబట్టి వచ్చే ఏడాది దాదాపు ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేశారు.. అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండాలి అని ప్రజలకు సూచించారు.
అంబటి ఏమంటున్నారంటే…
ప్రపంచమే కరోనా పై యుద్ధం చేస్తోంది.. ఇంత భయంకర పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు కొందరు విమర్శలు చేయటం దుర్మార్గం అంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. రికవరీలో జాతీయ సగటు 88.5 శాతంగా ఉంటే రాష్ట్రంలో 93.50 శాతం ఉందని.. విమర్శించే వాళ్లు దీనిని ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. దేశ వ్యాప్తంగా 12 కోట్ల మందికి వ్యాక్సిన్ వేస్తే కేవలం మన రాష్ట్రంలోనే 55 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామని వెల్లడించిన ఆయన.. కేంద్రం మొత్తం వ్యాక్సిన్ ఇస్తే కేవలం 10 రోజుల్లో రాష్ట్రం అంతటికి వ్యాక్సిన్ వేసే సామర్థ్యం యంత్రాంగానికి ఉందని.. కానీ, వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ కేంద్రం చేతిలో ఉన్నప్పుడు రాష్ట్రం ఏం చేయగలుగుతుంది? అని ప్రశ్నించారు.