YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి , వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కు ఒకే విషయంలో ఒకే రోజు చిర్రెత్తుకొచ్చిన విషయం అనుకోకుండా జరిగింది. ఈ ఇద్దరు నేతలూ ఓ రేంజ్లో ఫీలయేందుకు కారణం…తాజా ఎన్నికల ఫలితాలు. ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మిగతా జిల్లాల రాజకీయాలు ఒక ఎత్తు …. కృష్ణా జిల్లాలో పంచాయతీ ఎన్నికల రెండో దశ ఫలితాలు ఒక ఎత్తు అన్నట్లుగా మారింది. దీంతో ఈ జిల్లా రాజకీయాలపై కొత్త టాక్ వినిపిస్తోంది.
ఎన్టీఆర్ స్వగ్రామంలో…
కృష్ణా జిల్లాలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో టీడీపీ గెలుపొందింది. అయితే, ఎన్టీఆర్ తనయురాలు, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తీసుకున్న పక్క గ్రామంలో మాత్రం వైసీపీ గెలుపొందింది. మరోవైపు మంత్రి కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. నిమ్మకూరును మాజీ మంత్రి నారా లోకేష్ గత టీడీపీ హయాంలో దత్తత తీసుకోగా, భువనేశ్వరి పక్కనే ఉన్న కొమరవోలును దత్తత తీసుకున్నారు. నిమ్మకూరులో టీడీపీ, వైసీపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు బరిలో దిగగా టీడీపీ అభ్యర్ధి గెలిచారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దత్తత గ్రామం కోమరువోలు వైసీపీ కైవసం చేసుకుంది. కొమరవొలులో 102 ఓట్ల మెజార్టీతో సర్పంచి అభ్యర్థి దిరిశం రత్న కుమారి గెలుపొందారు.
భువనేశ్వరి టైం బ్యాడ్…
భువనేశ్వరి దత్తత గ్రామం కొమరువోలుతో నందమూరి కుటుంబానికి, నారా కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భువనేశ్వరి దత్తత తీసుకోవటమే కాకుండా అమ్మమ్మ ఊరు కూడా కావటంతో బంధువులు కూడా పెద్ద సంఖ్యలోనే ఇక్కడ ఉన్నారు. నందమూరి బాలకృష్ణతో సహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నిమ్మకూరు వస్తే కొమరవోలు ఖచ్చితంగా వెళ్ళేంత సన్నిహిత సంబంధాలు ఈ గ్రామంతో ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి ఆధిక్యం వచ్చింది. తాజా ఫలితాల్లోనూ అదే జరిగింది.
YS Jagan కొడాలి నాని కి మాత్రం…
మరోవైపు మంత్రి కొడాలి నానికి సొంత ఊరిలోనే ప్రతిపక్ష టీడీపీ షాక్ ఇచ్చింది. మంత్రి కొడాలి నాని సొంత ఊరిలో టిడిపి మద్దతు ఇచ్చిన అనూష అనే అభ్యర్థి దాదాపు 800 ఓట్ల మెజారిటీతో సర్పంచ్ గా గెలుపొందింది. పెదపారుపూడి మండలంలో ఉన్న ఎలమర్రు గ్రామంలో 12వ వార్డులకు గాను 11వ వార్డు టిడిపి అభ్యర్థులు కైవసం చేసుకోగా కేవలం ఒకే ఒక్క వార్డుకు వైసిపి పరిమితమైంది. ఒక రకంగా సొంత ఊరిలో ఇది కొడాలి నానికి షాక్ అనే చెప్పాలి. టీడీపీ అంటే మండిపడే కొడాలి నాని సొంత ఊరు మీద ఫోకస్ చేయలేకపోవడం ఆసక్తికరంగా మారింది. స్థూలంగా కృష్ణా జిల్లా ఇటు అధికార అటు ప్రతిపక్ష పార్టీ నేతలకు బీపీ పెంచేసిందని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.