YS Jagan : రాష్ట్రంలో ప్రభుత్వం, ఎస్ఈసీ SEC మధ్య జరుగుతున్న వివాదంలో జగన్మోహనరెడ్డి సర్కార్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. మొదటి నుండి ఎస్ఈసీతో ప్రభుత్వానికి వైరం ఉండగా సుప్రీం కోర్టు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వంపై నిమ్మగడ్డ పై చేయి సాదించారు. దీంతో ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ఎస్ఈసీ ఇరుకున పెడుతోంది. సీనియర్ ఐఎఎస్ అధికారులపై చర్యలు. ఎకగ్రీవాలను నిలుపుదల చేయడం, ప్రైవేటు యాప్ తీసుకురావడం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి గృహ నిర్బంధం చేయాలని ఆదేశాలు ఇలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో జగన్మోహనరెడ్డి సర్కార్, వైసీపీ నేతలు నిమ్మగడ్డ చర్యలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కట్టడి చేయడానికి జగన్మోహనరెడ్డి సర్కార్ ఓ ప్రణాళిక సిద్ధం చేసిందంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఎస్ఈసీ రమేష్ కుమార్ పై పిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారని టాక్. రాష్ట్రానికి చెందిన ముగ్గురు మంత్రులను వెంట బెట్టుకుని ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేసే అలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడుకు కళ్లెం వేయాలని అది ఒక్కటే మార్గమని వీరు భావిస్తున్నారుట. ఓ పార్టీకి కొమ్ము కాసే విధంగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారనేది వైసీపీ, ప్రభుత్వ వాదన. నిమ్మగడ్డ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలపై సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అయితే జగన్మోహనరెడ్డి నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తే ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా సిద్ధమవుతున్నారని అంటున్నారు. ఇప్పటికే ఆయన రాజ్యాంగ నిపుణులను సంప్రదింపులు జరిపారని వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం విధులు, అధికారాలు తదితర విషయాలపై మాజీ ఎస్ఈసీలతోనూ నిమ్మగడ్డ మాట్లాడుతున్నారని అంటున్నారు. ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య వైరం ఈ విధంగా కొనసాగుతూ తీవ్ర రూపం దాలిస్తే రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందనే వాదనలు కూడా వినబడుతున్నాయి. మరో పక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలు ముగియగానే మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకూ సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.