YS Jagan : ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో క్రియాశీల భూమికను పోషిస్తున్న తమ కష్టాన్ని గుర్తించి వేతనాలు పెంచుతారని భావిస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. రూ.5 వేలు ఇస్తూ గాడిద చాకిరీ చేయిస్తారని తమకు వేతనాలు పెంచాలి లేకుంటే వచ్చే నెల నుండి తమ సేవలను నిలుపుదల చేస్తామంటూ వివిధ జిల్లాలలో వాలంటీర్లు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వాలంటీర్ల డిమాండ్ ల పై స్పందించారు. గ్రామ, వార్డు వాలంటీర్లకు సిఎం జగన్ బహిరంగ లేఖ రాశారు.
ముఖ్యమంత్రి జగన్ వాలంటీర్ లను ఉద్దేశించి రాసిన నాలుగు పేజీల లేఖ ఉన్న సారాంశాన్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే వాలంటీర్లు జీతం కోసం పని చేసే ఉద్యోగులు కాదు. స్వచ్చందంగా సేవా భావంతో ముందుకు వచ్చిన నిరుద్యోగ యువతీ యువకులు. వారికి ఇస్తున్నది వేతనం కాదు. గౌరవ భృతి అని తేల్చి చెప్పేశారు.
ఇంత కన్నా మెరుగైన ఉద్యోగాలు ఎక్కడైనా వచ్చే వరకూ సేవా ధృక్పదంతో వాలంటీర్లు అన్ని పథకాలూ లబ్దిదారుల ఇళ్ల ఇంటి వద్దకే అందేలా డోర్ డెలివరీ చేస్తారు అని ఈ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడే తాను చెప్పడం జరిగిందన్నారు. వాలంటీర్ అనే పదానికి అర్థమే స్వచ్చందంగా సేవలు అందించడం, ఇది ఉద్యోగం కాదు, స్వచ్చంద సేవ. వాలంటీర్లుగా సేవలు అందిస్తున్న చెల్లెమ్మలూ, తమ్మళ్లూ ఈ విషయాన్ని గమనించాలన్నారు.
“వాలంటీర్లుగా సేవలు అందిస్తుండటం వల్లనే సమాజం నమస్కరిస్తుంది. ప్రభుత్వమూ వారిని సత్కరిస్తున్నది. జీతం కోసం పని చేస్తే ఇటువంటి గౌరవాన్ని పొందగలరా” అని ప్రశ్నించారు. “ వాలంటీర్ లకు గౌరవాన్ని దక్కకుండా చేసేందుకు, మంచి పేరును తుడిచేసేందుకు మొత్తంగా వాలంటీర్ వ్యవస్థే లేకుండా చేయాలన్న దుర్భద్ధితో ఎవరు కుట్రలూ కుతంత్రాలు పన్ను తున్నారో మీకు తెలుసు. ఇలా ప్రలోభాలకు గురి చేసే వారికి, రెచ్చగొట్టే వారికి దూరంగా ఉంటూ మీ కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మీ శ్రేయోభిలాషిగా, మీ అన్నగా విజ్ఞప్తి చేస్తున్నాను” అని సీఎం జగన్ పేర్కొన్నారు.