YS Jagan: నూతన పీఆర్సీ అమలునకు ప్రభుత్వం పట్టుదలతో ఉండగా, నూతన పిఆర్సి జీవోలను వెనక్కి తీసుకోవాల్సిందే నంటూ ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. పిఆర్సి విషయంలో అన్ని ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. మరోపక్క ప్రభుత్వం ఉద్యోగ సంఘాల బుజ్జగించేందుకు మంత్రులు, సీఎస్ తో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. సంప్రదింపులకు రావాలని ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రులు ఫోన్ చేయగా సంఘాల నేతలు నూతన పీఆర్సీ జీవోను వెనక్కి తీసుకుంటేనే చర్చలకు వస్తామని ఖండిగా చెప్పారు.
YS Jagan: జటిలంగా మారిన పీఆర్సీ ఇష్యూ
అటు ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు వెనక్కి తగ్గకపోవడంతో సమస్య జటిలంగా మారుతుంది. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు ఉన్నాయంటూ ఓ సెక్షన్ మీడియా ప్రచారం మొదలు పెట్టింది. కొత్త పి ఆర్ సి ప్రకారం జనవరి వేతనాల బిల్లులు పెట్టేందుకు ట్రెజరీ ఉద్యోగులు సుముఖంగా లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసింది. పే అండ్ అకౌంట్స్ సి ఎఫ్ ఎం ఎస్ కు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాలకు అనుకూలంగా, మరోపక్క వ్యతిరేకంగా సోషల్ మీడియాలో గ్రూపులు ప్రారంభమయ్యాయి.
ఉద్యోగులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆలోచించకుండా ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు అంటూ ప్రచారం చేయడంతో పాటు ఉద్యోగ సంఘాల్లో కొందరు ప్రభుత్వానికి అనుకూలంగా మారారు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై ఉద్యోగ సంఘాలు నోచ్చుకుంటున్నాయి. ప్రజలు తమపై రెచ్చగొట్టేలా, వ్యతిరేకత పెంచేలా దుష్ప్రచారం చేయవద్దు అంటూ ఉద్యోగ సంఘాలు వేడుకున్నాయి. తమ ఉద్యమంలో చీలిక తేవాలన్న కుట్రలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఎక్కడదాకా వెళ్తుందా వేచి చూడాలి.