YS Jagan: వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 30 నెలల తర్వాత ఓ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ కారణాల రీత్యా ఇప్పటి వరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండే పరిపాలన సాగిస్తూ వచ్చారు. తాజా నిర్ణయం ప్రకారం ఇక నుండి జనాల్లోకి ప్రతి నెల వెళ్లనున్నారు. కరోనా కష్టాలు వెంటాడుతున్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన నవరత్న హామీలను ఆటంకం లేకుండా అమలు చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా జనాల్లోకి రాకుండా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండే సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నారనే విమర్శ ఉంది.
YS Jagan: ప్రతి నెల రెండు మూడు జిల్లాల్లో
ప్రతిపక్షాలు కూడా ఎన్నికలకు ముందు పాదయాత్ర అంటూ జనాల్లో తిరిగిన జగన్… అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పరిమితమయ్యారని విమర్శిస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో నష్టనివారణ చర్యలకు జగన్ పూనుకున్నారని సమాచారం. ఈ క్రమంలోనే నిన్న గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పెన్షన్ పెంపు పథకాన్ని జనాల మధ్య లోనే లాంచనంగా ప్రారంభించారు. మార్చి తర్వాత గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నూతన సంవత్సరం నుండే ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాన్ని సీఎం జగన్ నిన్నటి నుండి ప్రారంభించారని టాక్. ప్రతి నెల రెండు మూడు జిల్లాల్లో పర్యటనలు ఉండేలా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారని వార్తలు వినబడుతున్నాయి. ప్రతిపక్షాల ఎత్తులు చిత్తు చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని ఆ క్రమంలో భాగంగా ఈ రెండేళ్లలో ప్రజలకు మరింత దగ్గర అయ్యేలా ప్లాన్ చేసుకుంటే పార్టీ ఓటు బ్యాంక్ చెక్కుచెదరని జగన్ ఆలోచనగా ఉందని అంటున్నారు.