YS Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి రాజధాని అమరావతి ప్రాంతంలో రైతాంగం నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఒక పక్క అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షలు కొనసాగుతుండగా, ఈ ఆందోళనలను టీడీపీ వెనుక ఉండి నడిపిస్తోందని అధికార వైసీపీ విమర్శిస్తోంది. మరో పక్క మూడు రాజధానులకు అనుకూలంగా కూడా శిబిరాన్ని ఏర్పాటు చేసి నిరసనలు నిర్వహించారు.
ఎన్నికలకు ముందు వైసీపీ రాజధానిని అమరావతి నుండి తరలిస్తామని చెప్పలేదనీ, అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రాజధాని రెఫరెండంగా మళ్లీకి ఎన్నికలకు సిద్ధం కావాలంటూ వైసీపీకి టీడీపీ సవాల్ కూడా విసిరింది. అయితే టీడీపీ సవాల్ ను వైసీపీ స్వీకరించలేదు.
ఇప్పుడు రాష్ట్రంలో ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండగానే మరో కీలక ఎన్నిక సిద్ధం అయ్యింది. కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిపికేషన్ విడుదల అయ్యింది. ఈ ఎన్నికకు గతంలో ఇక్కడ నుండి విజయం సాధించిన హేమా హెమీలతో పాటు అధికార వైసీపీ కూడా అభ్యర్థిని కూడా రంగంలోకి దింపే అవకాశం ఉండటంతో అమరావతి ప్రాంత ఓటర్ల తీర్పు ఎలా ఉంటుంది అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. రాజధానిపై అధికార, విపక్ష వర్గాల్లో జరుగుతున్న అనుకూల వ్యతిరేక ప్రచారాలు అలా ఉంచితే ఉపాధ్యాయ వర్గ ఓటర్లతో జరుగుతున్న ఈ ఎన్నికతో విద్యావంతుల తీర్పు ఎటు అనేది తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అధికార వైసీపీ కూడా ఓ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంటున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తిగా మారింది.
ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న అమ్మినేని శివరామకృష్ణ (ఎఎస్ రామకృష్ణ) పదవీ కాలం వచ్చే నెలాఖరుతో ముగియనున్నది. ఇప్పటి వరకూ ఆయన టీడీపీ సభ్యుడుగా మండలిలో కొనసాగారు. అయితే ఆయన ఈ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. ఇది ఒకరకంగా టీడీపీకి షాకే. గత ఎన్నికల సమయంలో కృష్ణా, గుంటూరు జిల్లాలో టీడీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు ఎమ్మెల్సీగా ఆయన గెలుపునకు కృషి చేశారు. అయితే ఇప్పుడు ప్రతిపక్ష టీడీపీ మద్దతు తీసుకుంటే ఉపాధ్యాయ వర్గాల మద్దతు కొరవడుతుందని భావించే స్వతంత్ర్య అభ్యర్థిగా రంగంలో దిగుతున్నట్లు సమాచారం.
ఇక ఇదే నియోజకవర్గం నుండి వామపక్ష అనుబంధ సంఘాలైన ఎస్టీఎఫ్, యూటిఎఫ్ మద్దతుతో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు రంగంలో ఉన్నారు. గతంలో పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా గెలిచిన బొడ్డు నాగేశ్వరరావు ఈ సారి ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి బరిలో ఉంటున్నారు. పలు వామపక్షాల మద్దతు ఆయనకు బలంగా ఉన్నప్పటికీ వామపక్షేతర సంఘాల మద్దతు ఎంత వరకూ సాధించగలరనేదానిపై గెలుపు ఓటములు ఉండే అవకాశం ఉంది.
ఇక రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఈ ఎన్నికలో వైసీపీ నేరుగా అభ్యర్థిని రంగంలోకి దింపుతుందా లేక ఎవరికైనా మద్దతు ఇస్తుందా అన్న దానిపై ఇంకా స్పష్టత అయితే రాలేదు కానీ విద్యాశాఖలో ఉన్నతాధికారి సతీమణి కల్పలతకు అధికార పార్టీ మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. పార్టీలో కీలకనేతగా ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు ఆశీస్సులు కల్పలతకు ఉన్నాయని అంటున్నారు. ఉపాధ్యాయ వర్గాలు రాజధానిపై తీర్పును జగన్ కు అనుకూలంగా ఇస్తారా? వ్యతిరేకంగా ఇస్తారా? అనేది హాట్ టాపిక్ గా ఉంది.