YS Jagan Bail Case: తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకు, వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజుకు ఒక పండుగ ముగిసింది. మరో పండుగకు సిద్ధం అవుతున్నారు. సాధారణంగా చిన్న పిల్లలు పండుగలు వస్తే బాగుంటుంది అని ఎదురుచూస్తుంటారు. వినాయక చవితి వస్తే బాగుంటుంది. దసరా వస్తే బాగుంటుంది. పది రోజులు స్కూలుకు సెలవులు ఇస్తారు ఎంచక్కా స్నేహితులతో ఆడుకోవచ్చు అని పిల్లలు భావిస్తుండేవారు.
పండుగ వచ్చి వెళ్లిపోయిన తరువాత అయిపోయింది అంటూ నిరుత్సాహ పడుతుంటారు. అలానే టీడీపీ అనుకూల మీడియా గానీ, రఘురామ కృష్ణంరాజు గానీ ఇదిగో జగన్మోహనరెడ్డి బెయిల్ రద్దు తీర్పు అదుగో జగన్మోహనరెడ్డి బెయిల్ రద్దు తీర్పు అంటూ ఎదురుచూసి చూసి తీరా తీర్పు వచ్చిన తరువాత ఏమీ లేదు అంటూ నిరుత్సాహపడ్డారు. చిన్న పిల్లలు, పండుగ దీనికి లింక్ ఏమిటి అనుకుంటున్నారు. ఇప్పుడు అదే వివరించేది. టీడీపీ అనుకూల మీడియా గానీ, రఘురామ కృష్ణం రాజు గానీ చేస్తున్న పనులు చిన్న పిల్లల మనస్థత్వం (చైల్డిష్ బిహేవియర్) లాగా కనబడుతోంది.
బెయిల్ రద్దు కేసులో వీరు చేయకూడని తప్పులు అన్నీ చేశారు. వైసీపీ చేసినట్లుగానే వీరు ఇప్పుడు చేశారు. వైసీపీ న్యాయ వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేస్తుంది, న్యాయమూర్తులను టార్గెట్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఆడుకుంటుంది. వైసీపీ అనుకూల సాక్షి మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు రఘురామ కృష్ణం రాజు కూడా అటువంటి తప్పులే చేసినట్లు కనబడుతోంది. బెయిల్ రద్దు పిటిషన్ వేయడానికి రఘురామ కృష్ణం రాజు ఏ అర్హతతో వేసినట్లు. ఆయన జగన్ పార్టీ నుండే ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడు. జగన్ తో ఏవో తేడాలు వచ్చి పడకపోవచ్చు. కానీ ఇటువంటి పిటిషన్ చంద్రబాబో లేక టీడీపీ వాళ్లో వేశారు అనుకుంటే ఒ అర్ధం ఉంటుంది. రఘురామ కృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ కు విచారణ అర్హతే లేదని గతంలోనే వైసీపీ చెప్పింది. ఆ మేరకు జగన్ తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు కూడా వినిపించారు. వాస్తవంగా జగన్మోహనరెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘించినట్లైయితే ఆ కేసులో సాక్షులు గానీ, సీబీఐ గానీ, ఈడీ గానీ పిటిషన్ వేసే దానికి అర్హత ఉంటుంది, దాన్ని కోర్టు కూడా పరిగణలోకి తీసుకుంటుంది. సీరియస్ గా విచారణ జరుగుతుంది, ఆ మాదిరిగానే తీర్పు ఉంటుంది.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే రఘురామ కృష్ణం రాజు పిటిషన్ వేసిన వెంటనే జగన్ బెయిల్ రద్దు అయిపోతుంది. ఆయన జైలుకు వెళ్లిపోతాడు, ఆయన జైలుకు వెళితే ముఖ్యమంత్రి ఎవరు అంటూ కూడా ప్రచారాన్ని లేవనెత్తి టీడీపీ అనుకూల మీడియా ఛానల్స్ లో డిబేట్లు కూడా నిర్వహించాయి. రఘురామ కృష్ణం రాజు పిటిషన్ పై సీబీఐ కోర్టు తీర్పు తేదీ ప్రకటించిన నాటి నుండి జగన్ బెయిల్ రద్దు విషయంపైనే ఆ సెక్షన్ మీడియా ఫుల్ ఫోకస్ పెట్టి డిబేట్లు నిర్వహించాయి. కోర్టు తీర్పు రాకముందే రఘురామ కృష్ణం రాజు ఇక జగన్ జైలుకు వెళ్లిపోతున్నాడంటూ తరచు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.
కోర్టు తీర్పు ఎప్పుడు వాయిదా ఆ రోజు బెయిల్ రద్దు అంటూ క్వచ్చన్ మార్కు తో మీడియాలో ప్రసారాలు చేయడం, వార్తలు రాయడం చేశాయి. చివరికి రఘురామ కృష్ణంరాజు సిబీఐ కోర్టు తీర్పునకు ఒక రోజు ముందు సీబీఐ కోర్టు తీర్పుపై నమ్మకం లేదు, కోర్టును మార్చాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇలా ఎందుకు చేశారంటే.. ఇదో బ్లఫ్ గేమ్. ఇప్పటి వరకూ ఏపిలో వైసీపీ న్యాయవ్యవస్థపై నమ్మకం లేకుండా ప్రవర్తిస్తుంది, న్యాయ వ్యవస్థపై దాడి చేస్తుంది అని అందరూ అంటున్నారు. ఇప్పుడు రఘురామ చేసిన పని కూడా అదే కదా. విచారణ అర్హతే లేని పిటిషన్ వేసి దానికి తోడు తప్పుడు ప్రచారాన్ని విస్తృతంగా చేయడంతో చివరాఖరుకు జరిగింది ఏమిటి అంటే రఘురామకృష్ణం రాజు, ఏబీఎన్ రాధాకృష్ణ గేమ్ ఫెయిల్ అయ్యింది. వైసీపీ పై స్థాయిలో ఉన్న మేనేజ్మెంట్ నేపథ్యంలో సీబీఐ గుమ్మనంగా ఉండటంతో తీర్పు అనుకూలంగా వచ్చింది.