YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గ ప్రక్షాళన ఎప్పుడు..వైసీపీలో అలానే ఏపి రాజకీయ వర్గాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఎందుకంటే సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం రోజునే మంత్రుల పదవీ కాలం రెండున్నర సంవత్సరాలు అని చెప్పిన విషయం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. రెండున్నర సంవత్సరాలకు మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుంది అని జగన్ స్పష్టంగా నాడు జగన్ చెప్పేశారు. 90 శాతం మార్చేస్తాను అని చెప్పారు. జాగ్రత్తగా పని చేయాలి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి అని తెలిపారు. జగన్మోహనరెడ్డి చెప్పిన విధంగా రెండున్నర సంవత్సరాలు దాటి పోయి నెల రోజులు కావస్తుంది. ఇంకా మంత్రివర్గ ప్రక్షాళన ఎందుకు చేయడం లేదు, జగన్మోహనరెడ్డి ఆలోచన ఏమిటి, వైసీపీ వాళ్లు ఏమని అనుకుంటున్నారు అనేది చర్చనీయాంశం అవుతోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం జగన్మోహనరెడ్డి మార్చి నెలలో కేబినెట్ లో మార్పులు చేయబోతున్నారు. మార్చి నెలలో ఈ మంత్రివర్గ ప్రక్షాళన ఒక్కటే కాదు చాలా విషయాలపై కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. మార్చి నెలలోనే పార్టీ ప్రక్షాళన, ప్రభుత్వ ప్రక్షాళన, రాజధాని వికేంద్రీకరణ బిల్లు మళ్లీ పెట్టడం ఈ మూడు అంశాలను పూర్తి చేయనున్నారు.
YS Jagan: వ్యూహాత్మక కమిటీ ఏర్పాటు
ప్రభుత్వ ప్రక్షాళన అంటే ఇప్పుడు మంత్రులను మార్చడం ద్వారా. మంత్రుల్లో మొత్తం తీసేయడం గానీ లేదా నలుగురు లేదా అయిదుగురుని ఉంచి మిగతా వాళ్లను మార్చడం. పార్టీలో ప్రక్షాళన అంటే జిల్లాల వారీగా ప్రస్తుతం ఇన్ చార్జిలు ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, అయోధ్య రామిరెడ్డి లు జిల్లాల ఇన్ చార్జిలుగా ఉన్నారు. వీళ్లకు జిల్లా బాధ్యతలను తప్పించి రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ అంతర్గతంగా ఏర్పాటు చేసే వ్యూహాత్మక కమిటీలో వీరికి బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నారుట. ఇక తొలగించిన 20 మంది మంత్రుల్లో పది మంది సీనియర్ మంత్రులతో ఒక కీలక కమిటీని వేయనున్నారుట. ఈ కమిటీ సభ్యులు జిల్లాల ఇన్ చార్జిలుగా నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితులు ఇతర విషయాలపై చర్చించి తగు చర్యలు తీసుకోవడం, అవసరమైన ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించడం తదితర బాధ్యతలను అప్పగించనున్నారుట. పార్టీకి, ప్రభుత్వానికి మద్య సమన్వయంగా ఈ కమిటీ పని చేయనున్నది.
మార్చి నెలలో మంత్రి వర్గ ప్రక్షాళన..?
ఇక ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరిని ఉంచే అవకాశం ఉంది ? ఎవరెవరిని తొలగించనున్నారు ? అని పరిశీలిస్తే.. రెడ్డి సామాజికవర్గం నుండి నలుగురు మంత్రులు ఉన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వీళ్లలో ఎవరిని తొలగించాలన్న జగన్మోహనరెడ్డికి ఇబ్బందే. బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం జగన్ మామ. దగ్గరి బందువు, ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ మంత్రి. అత్యంత కీలకంగా పని చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబును కోలుకోలేని విధంగా దెబ్బతీయడానికి స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. గౌతమ్ రెడ్డి విషయానికి వస్తే నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబం చాలా బలమైనదనిగా పేరుంది. జగన్మోహనరెడ్డికి సన్నిహితుడు. బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి మంచి వక్త, మంచి తెలివైన వాడిగా పేరు ఉంది. ఒక వేళ్ల వీళ్లను మంత్రివర్గంలో ఉంచి మిగతా వాళ్లను మార్చేస్తే సొంత సామాజికవర్గం వాళ్లను ఉంచుకున్నారు అన్న చెడ్డపేరు వస్తుంది. అందుకే మొత్తాన్ని మార్చేసే ఆలోచన చేస్తున్నారనేది సమాచారం. కొత్తగా పోటీలో ఆర్కే రోజా, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇలా చాలా మంది మంత్రివర్గ రేసులో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రులతో వేసే కమిటీ జిల్లాల వారిగా పరిస్థితులు తెలుసుకుని వాళ్లతో ముఖాముఖి మాట్లాడి 50 మంది పేర్లను షార్ట్ లిస్ట్ చేసి సీఎం జగన్ కు అందజేయనున్నారని సమాచారం. ఆ తరువాత ప్రశాంత్ కిషోర్ టీమ్ వాళ్ల జాబితా ఆధారంగా ప్లస్ లు మైనస్ లు ఆయా జిల్లాల్లో విచారించి జగన్మోహనరెడ్డికి ఇస్తారు. ఆ తదుపరి జగన్మోహనరెడ్డి వద్ద ఉన్న వ్యక్తిగత సమాచారం, పీకే టీమ్ ఇచ్చే వివరాలు క్రోడీకరించుకుని 25 మందితో ఫైనల్ లిస్ట్ తయారు చేయనున్నారని తెలుస్తోంది. రాబోయే మంత్రివర్గంలో ఎస్సీ, బీసీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారనేది సమాచారం. చూడాలి మంత్రివర్గ కూర్పు ఏలా ఉంటుందో.