YS Jagan: ఏపిలోని పలు జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా అపారనష్టం వాటిల్లింది. ప్రధానంగా కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వరద పరిస్థితులపై ఏరియల్ సర్వే చేసి సహాయక చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శిస్తూ ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే వరదల వల్ల ఎక్కువ నష్టం వాటిల్లిందనీ ఆరోపించారు. బాధితులను సీఎం జగన్ పరామర్శించకపోవడాన్ని తప్పుబట్టారు. సొంత జిల్లా కడప లోనూ జగన్ పర్యటించలేదనీ చంద్రబాబు అన్నారు. ఏరియల్ సర్వే చేసి వెళ్లిపోవడాన్ని చంద్రబాబు ఆక్షేపించారు.
YS Jagan: సహాయక చర్యల్లో ఇబ్బందులు కలగకూడదనే..
చంద్రబాబు విమర్శలపై సిఎం జగన్ స్పందించారు. శుక్రవారం అసెంబ్లీలో వరద సహాయ చర్యల గురించి వివరిస్తూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు సీఎం వెళ్లడం ముఖ్యం కాదనీ, అక్కడ సహాయ చర్యలు అందడం ప్రధానమన్నారు. ముఖ్యమంత్రి వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళితే సహాయక చర్యల్లో ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ కోసం చేసే ప్రయత్నాలు అందరికీ తెలుసున్నాను. హూదూద్ వస్తే నేనే ఆపేశాను, తిత్లీ వస్తే దారి మళ్లించాను అంటూ చంద్రబాబు కబుర్లు చెప్పారని సెటైర్ వేశారు. గడచిన వందేళ్లలో కనీవినీ ఎరుగని వానలు కురిశాయని జగన్ అన్నారు. వానలు రాయలసీమను ముంచెత్తడం చరిత్ర లో ఎప్పుడూ జరగలేదనీ, నీళ్లు లేక అలమటించే రాయలసీమలో అనూహ్య వరదలు సంభవించాయని అన్నారు. ఫించ, అన్నమయ్య రిజర్వాయర్ల కట్టలు తెగిపోయాయనీ, చెయ్యేరు నది పరివాహక ప్రాంతాలు జలదిగ్బంధం అయ్యాయన్నారు. అకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వానలు కురిశాయనీ, కొన్ని చోట్ల ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగిందన్నారు. నష్టం వివరాలను ఎక్కడా దాచడం లేదని స్పష్టం చేస్తూ సహాయం అందించడంలో ఎక్కడా వెనుకడుగు వేయడం లేదని సీఎం జగన్ పేర్కొన్నారు. విపత్తును విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని జగన్ విమర్శించారు.
చంద్రబాబు సంస్కారానికి నమస్కారం
“రాజకీయం కోసం ప్రభుత్వం పై బురద జల్లుతున్నారన్నారు. నేను గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని చంద్రబాబు విమర్శించారు. శాశ్వతంగా కనుమరుగైపోతానని ప్రతిపక్ష నేత అన్నారు. చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారం. వరద సహాయక చర్యలు ఆగకూడదనే నేను వెళ్లలేదు. సీనియర్ అధికారుల సూచనల మేరకే ఆగిపోయా, నేను వెళ్లడం కన్నా బాధితులకు సహాయం అందడం ముఖ్యం. జిల్లాకొక సీనియర్ అధికారిని పంపాం. మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండమన్నాం. నేను ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించాను” అని జగన్ పేర్కొన్నారు. ఒడిశాలో తరచు భారీ వర్షాలు, వరదలు సంభవిస్తుంటాయని పేర్కొన్న సీఎం జగన్.. అక్కడ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వరద ప్రాంతాల్లో పర్యటించిన సందర్భాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. సహాయక చర్యల్లో ఎటువంటి లోటు లేకుండా పర్యవేక్షణ చేస్తారన్నారు. పబ్లిసిటీ కోసం చంద్రబాబు లాంటి వాళ్లే జనాల్లోకి వెళ్లి సహాయ చర్యలకు ఆటంకం కల్గిస్తారని అన్నారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ జరుగుతోందని సీఎం జగన్ చెప్పారు. కడప జిల్లా నా సొంత ప్రాంతం, సహాయక చర్యలు అయిపోయిన తరువాత కశ్చితంగా వెళతాను, సహాయక చర్యలు బాగా అందాయా లేదా తెలుసుకుంటాను అని స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్.