YS Jagan : ఏపిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల గ్రామ, వార్డు వాలంటీర్లు తమకు వేతనాలు పెంపు చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటింటి రేషన్ పథకం వాహన ఆపరేటర్ లు బాధ్యతలు చేపట్టిన పది రోజుల్లోనే ఆందోళన చేస్తే రూ.16 వేల నుండి రూ.21 వేలు చేసిన ప్రభుత్వం.. ఏడాదిన్నర నుండి గొడ్డు చాకిరీ చేస్తున్న తమకు మాత్రం కేవలం రూ.5వేలు మాత్రమే ఇస్తున్నారనీ, తమకు వేతనాలు రూ.12వేలకు పెంచాలంటూ వాలంటీర్లు డిమాండ్ చేశారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వాలంటీర్ల మరో మాట మాట్లాడే అవకాశం లేకుండా ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. వాలంటీర్ లు జీతానికి పని చేసే ఉద్యోగులు కాదు, స్వచ్చందగా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చిన వారు, వారికి ఇస్తున్నది జీతం కాదు, గౌరవ భృతి అంటూ చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు తాను చెప్పాననీ, వాలంటీర్ ల హాండ్ బుక్ లోనూ ఇది ఉంటుందని స్పష్టం చేశారు. వేరే మంచి ఉద్యోగం వచ్చే వరకూ వారు వాలంటీర్ గా సేవలు అందించవచ్చని తెలిపామన్నారు. ప్రతి రోజు కార్యాలయానికి వాలంటీర్లు వెళ్లాల్సిన అవసరం లేదని కూడా తెలిపారు.
అయితే ఇంతకు ముందు వాలంటీర్ లు ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా గ్రామ సచివాలయాలకు, మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లి ఉదయం నుండి సాయంత్రం వరకూ ఏదో పని చేసే వారు. ఇప్పటి వరకూ ఉద్యోగులుగా బాధ్యతలు నిర్వహించిన వాలంటీర్లు సీఎం లేఖ తరువాత ఇంతకు ముందు మాదిరిగా కార్యాలయాలకు వెళ్లడం లేదని తెలిసింది. పెన్షన్లు పంపిణీ చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజెప్పడం వరకే తమ పని, రోజు కార్యాలయానికి రావాల్సిన పని లేదు అని వాలంటీర్ లు కరాఖండిగా చెబుతున్నట్లు సమాచారం.
YS Jagan : జీతాలు పెంచమంటే సేవకులుగా మారుస్తారా?
వాలంటీర్లు సేవలకులు అంటూ సీఎం జగన్ లేఖ రాయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పుబట్టారు. జీతాలు పెంచమని అడిగితే వాలంటీర్లను ఉద్యోగుల నుండి సేవకులుగా మారుస్తారా అని ప్రశ్నించారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో వాలంటీర్లను నియమించి.. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని గుర్తు చేశారు. మాట తప్పం – మడమ తిప్పం అన్న సీఎం జగన్ ఇప్పుడు వాలంటీర్లను సేవకులుగా గుర్తిస్తూ లేఖ రాయడాన్ని ఏమనాలి అన్నారు. ఎమ్మెల్యేలు కూడా ప్రజా సేవకులే కదా వారికి నెలకు లక్షలాది రూపాయలు చెల్లించడం ఎందుకని రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్రంలో నియమించబడిన రెండున్నర లక్షల మంది వాలంటీర్లను ప్రభుత్వం దగా చేస్తోందని విమర్శించారు. జగన్ కు చిత్తశుద్ధి ఉంటే వాలంటీర్లకు వేతనం రూ.12వేలు ఇవ్వాలని, ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.