YS Jagan Delhi Tour : ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మరో సారి ఢిల్లీ వెళుతున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వచ్చిన జగన్ మళ్లీ ఇప్పుడు ఎందుకు వెళుతున్నారు అనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరగా దాదాపు ఖరారు అయినట్లు చెబుతున్నారు.
ఈ నెల నాల్గవ తేదీన అమిత్ షా నేతృత్వంలో తిరుపతిలో జరగాల్సిన సదరన్ కౌన్సిల్ సమావేశం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో అమిత్ షా రాష్ట్ర పర్యటన క్యాన్సిల్ అయ్యింది. తొలుత ఏపి సిఎం వైఎస్ జగన్ తిరుపతిలో ముఖ్యమంత్రుల సమావేశంలో అమిత్ షాతో రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను విన్నవించాలని భావించారు. అయితే అమిత్ షా పర్యటన వాయిదా పడటంతో ఢిల్లీకి వెళ్లి కలిసేందుకు ప్లాన్ సిద్ధం చేసుకున్నారని అనుకుంటున్నారు. గత జనవరి నెలలో అమిత్ షాతో భేటీ అయిన జగన్ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక విషయాలపై చర్చించారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో మున్సిపల్, నగర పాలక సంస్థలు ఎన్నికలు జరుగుతున్న వేళ జగన్ హస్తినకు బయలుదేరి వెళుతుండటంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
ప్రధానంగా గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించినందున ఇక్కడ నగర పాలక సమస్థపై వైసీపీ జండా ఎగరాలన్న సంకల్పంతో వైసీపీ ఉంది. ఒక వేళ ఇక్కడ పరాజయం పాలైతే రాజధానిని తిరస్కరించినట్లు ప్రతిపక్షాలు విమర్శించే ప్రమాదం ఉంది. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను నిరసిస్తూ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున విశాఖలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వారి ఆందోళనకు అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలియజేస్తున్నాయి. ఈ ప్రభావం నగర పాలక సమస్థ ఎన్నికలపై పడవచ్చని భావిస్తున్నారు.
ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పునరాలోచన చేయాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి జగన్ లేఖ రాశారు. ఆయినప్పటికీ కేంద్రం మాత్రం ప్రైవేటీకరణ విషయంలో వెనుకడుగు వేసే అవకాశం కనిపించడం లేదు. అందుకే జగన్ ఢిల్లీ వెళ్లి అంశంపై స్పష్టమైన హామీ తీసుకుని కార్మికుల ఆందోళన విరమింపజేస్తే విశాఖ ఎన్నికల్లో వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాల్సిన పరిస్థితే ఎదురైతే దాన్ని రాష్ట్రానికి కేటాయించాలని కోరడంతో పాటు ప్లాంట్ లాభాలబాట పట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారని అంటున్నారు. ఈ అంశంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిధులు, జీఎస్టీ బకాయిలు, విభజన హామీల అమలు తదితర కీలక అంశాలపైనా మోడీ, షా భేటీలో జగన్ చర్చించే అవకాశం ఉంది.