YS Jagan : ప్రభుత్వం, వైసీపీ వద్దు వద్దు అంటున్నా ఏపిలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. సుప్రీం కోర్టు తీర్పు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలను రీషెడ్యుల్ చేశారు. రెండవ దశ ఎన్నికలను మొదటి దశకు మార్చేసి బుధవారం నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఓ పక్క ఎన్నికల ప్రక్రియ వేగంగా జరుగుతుండగా అధికార వైసీపీ అనూహ్యంగా ఏకగ్రీవాల పల్లవి ఎత్తుకుంది. వైసీపీ అత్యధిక స్థానాలు కైవశం చేసుకుంటుందని ఒక పక్క చెబుతూనే మరో పక్క గ్రామాల్లో అందరూ ఏకగ్రీవాలకు సహకరించాలంటూ మంత్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నప్పటికీ తమ తమ పార్టీల అభ్యర్థులను రంగంలోకి దింపి బలపరుస్తుంటాయి. గ్రామాల్లో పార్టీల పరంగా కాకుండా వ్యక్తుల పరంగానే విజయావకాశాలు ఉంటుంటాయి. అయితే అధికార వైసీపీ మాత్రం ఇప్పుడు ఎక్కువగా ఏకగ్రీవాలు చేయాలని దృష్టి సారిస్తోంది.
ఏకగ్రీవాలు చేయడం వల్ల నేతలకు అనేక రకాల లాభం ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఓటర్ల వద్దకు వెళ్లి ప్రలోభాలకు గురి చేయాల్సిన అవసరం లేదు. గెలుస్తామా ఓడతామా అన్న భయపడాల్సిన పనిలేదు. ఏకగ్రీవంగా ఎన్నికైన నాయకుడి మెడలో పార్టీ కండువా వేసి తమ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యాడని చెప్పేసుకోవచ్చు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సింబల్ అనేది లేకపోవడం వల్ల ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీకి మారినా, అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీకి మారినా అతని పదవికి ఎటువంటి ఢోకా ఉండదు.
YS Jagan : ఏకగ్రీవాలకు ప్రభుత్వ ప్రోత్సాహక బహుమతి పెంపు
ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించేందుకు అధికార వైసీపీ ప్రభుత్వం ప్రోత్సాహాక నగదును భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. గ్రామ పంచాయతీల జనాభా ఆధారంగా రూ.5లక్షల నుండి 20 లక్షల వరకూ ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహాక బహుమతిగా ప్రకటించింది. ఈ నిధులు ఆయా గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చు. ప్రభుత్వ ప్రోత్సాహాకలను వివరిస్తూ ఏకగ్రీవాలకు కృషి చేయాలని అధికార పార్టీ తమతమ మంత్రులు, ప్రజా ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేసింది. మంత్రులు ఈ ప్రకటన చేసిన వెంటనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దీనిపై ఒక్కసారిగా రియాక్ట్ అయ్యారు. ఏకగ్రీవం అయిన పంచాయతీలపై దృష్టి పెడతామని ఆయన పేర్కొన్నారు. అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారా లేక బలవంతపు ఏకగ్రీవాలా అనేది తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక అధికారిని కూడా ఆయన నియమించనున్నారు.
YS Jagan : ఏకగ్రీవాలపై ఎస్ఈసీ దృష్టి
ఓ పక్క అధికార పార్టీ నేతలు ఏకగ్రీవాలపై దృష్టి సారిస్తుండగా మరో పక్క ఎస్ఈసీ నిమ్మగడ్డ బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా చూడాలన్న పట్టుదలతో ఉన్నారు. ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతల నామినేషన్లను అడ్డుకుని అధికార పార్టీ బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకున్నారని టీడీపీ నాడు ఆరోపించింది. నామినేషన్ల సందర్భంలో ఘర్షణలు జరగడం, నామినేషన్ల పేపర్లు చించివేయడం లాంటి ఘటనల వీడియోలు మీడియాలోనూ వచ్చాయి. నాడు వీటిపై ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా నాడు ఎస్ఈసీ నిమ్మగడ్డ పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వంతో ఆయనకు చెడిన కారణంగా ఏకగ్రీవాలపై ఒక కన్ను వేయాలని చూస్తున్నారు. నిమ్మగడ్డ తన ప్రయత్నంలో తాను ఉన్నప్పటికీ అధికార పార్టీ మాత్రం ఏకగ్రీవాలపై దృష్టి పెట్టింది. ఏకగ్రీవాలు అవ్వడానికి వీలులేదనీ గ్రామంలోనూ అభ్యర్థులను పోటీకి నిలపాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. మరో పక్క జనసేన – బీజెపీ కూడా పోటీకి సై అంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్ని పంచాయతీలు ఏకగ్రీవం అవుతాయో చూడాలి మరి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?