YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా కడప జిల్లా బద్వేల్ కు కానుక అందించారు. బద్వేల్ ను రెవెన్యూ డివిజన్ గా కేటాయిస్తూ జగన్ సర్కార్ నేడు జీవో విడుదల చేసింది. కడప జిల్లాలో ఇప్పటి వరకూ కడప, జమ్మలమడుగు, రాజంపేట మూడు రెవెన్యూ డివిజన్ ఉన్నాయి. కడప డివిజన్ పరిధిలో 18, రాజంపేట డివిజన్ లో 17, జమ్మలమడుగు డివిజన్ పరిధిలో 16 మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం బద్వేల్ పరిసర మండలాలు కడప రెవెన్యూ డివిజన్ పరిధిలో కొనసాగుతున్నాయి. బద్వేల్ లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుండో ఉంది.
YS Jagan: జూలైలో హామీ డిసెంబర్ లో ఉత్తర్వులు
ఈ ఏడాది జూలై లో బద్వేల్ పర్యటనకు వెళ్లిన సమయంలో సీఎం జగన్ బద్వేల్ లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చే క్రమంలో సెప్టెంబర్ 16వ తేదీన మంత్రివర్గ సమావేశంలో బద్వేల్ రెవెన్యూ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంగళవారం బద్వేల్ ను రెవెన్యూ డివిజన్ గా కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. బద్వేల్ రెవెన్యూ పరిధిలో బద్వేల్, మైదుకూరు, బ్రహ్మంగారిమఠం, పోరుమామిళ్ల, సిద్దవటం, శ్రీఅవధూత కాశినాయన, కలసపాడు, బి కోడూరు, అల్లూరు, గోపవరం మండలాలు ఉండనున్నాయి.
అత్యధిక మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గానికి నజరానా
ఇటీవల జరిగిన బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ దాసరి సుధ 90వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. ఈ మెజార్టీ పులివెందులలో వైఎస్ జగన్ కు వచ్చిన దాని కంటే అధికం. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మృతితో నిర్వహించిన ఉప ఎన్నికకు వైసీపీ తమ అభ్యర్ధిగా వెంకట సుబ్బయ్య సతీమణి దాసరి సుధను అభ్యర్ధిగా ప్రకటించగా, గత సంప్రదాయాలను అనుసరించి ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో సహా జనసేన అభ్యర్ధులను పోటీ పెట్టలేదు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్ధులు పోటీ చేసినా ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయారు. రాష్ట్రంలో వైసీపీకి భారీ మెజార్టీ అందించిన బద్వేల్ కు జగన్ తన పుట్టిన రోజు కానుకగా రెవెన్యూ డివిజన్ జీవో ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.