YS Jagan: దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయిన అంశంలో ఏపీ ముఖ్యమత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం కరోనా మందు విషయంలో ఏపీ సర్కారు ఎందుకు ఓ వైఖరి తీసుకోలేకపోతోంది? ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. అయితే, తాజాగా ఏపీ మంత్రి చేసిన ప్రకటన ప్రభుత్వం మీమాంసపై క్లారిటీ ఇస్తోందని ఇంకొందరు అంటున్నారు.
ఆనందయ్య మందుపై అత్యవసరంగా…
ఆనందయ్య మందు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన నేపథ్యంలో జాతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ (సీసీఆర్ఏఎస్) రంగంలోకి దిగింది. మొదటి దశలో ముందు తీసుకున్న 500 మంది వివరాలు సేకరించిన సంస్థ నెల్లూరు జిల్లా ఎస్పీ సహకారంతో మందు తీసుకున్న వారి ఆరోగ్య , ఇతరత్రా అంశాలను అధ్యయనం చేస్తోంది. కరోనా పరీక్షల రిపోర్టులు, ఆనందయ్య వద్ద మందు వేయించుకున్నప్పటి పరిస్థితి, తర్వాత వారి ఆరోగ్య పరిస్థితులు, ప్రస్తుత మెడికల్ రిపోర్టులపై ఆరా తీసింది. విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన స్థానం మరియు తిరుపతి ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి ద్వారా ఈ వివరాలు సేకరించి రోగులపై మందు చూపించిన ప్రభావాన్ని విశ్లేషించడం ద్వారా ఆనందయ్య మందు విషయంలో ప్రాథమిక నిర్ధారణకు సీసీఆర్ఏఎస్ రానుంది.
ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..
మరోవైపు ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయుర్వేదిక్, హోమియోపతి వేల సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో అల్లోపతి వైద్యం తప్పదని చెప్పారు. కోవిడ్ విషయంలో ప్రపంచం అనుసరిస్తున్న ప్రోటోకాల్ అనుసురించాల్సి వస్తుందని బుగ్గన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కరోనాను ఏపీ ప్రభుత్వం అద్భుతంగా హాండిల్ చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.